శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది. 17 రోజుల్లో రూ.1.81 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఉభయ దేవాలయాల పరివార ఆలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా హుండీల ద్వారా నగదు రూపేణా రూ.1,81,36,794, అలాగే 103 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి వచ్చింది. అలాగే 139 అమెరికా డాలర్లు, 15 యూఏఈ దిర్హమ్స్, పది ఇంగ్లాండ్ పౌండ్స్, 13 ఖతార్ రియాల్స్, రెండు సింగపూర్ డాలర్లు హుండీల్లో వచ్చాయని దేవస్థానం ఈవో లవన్న వివరించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపు చేపట్టారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.