శ్రీశైలం : శివన్నామస్మరణతో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మార్మోగింది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులన్నీ కిటకిటలాడాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి అమ్మవార్లకు జరిగే సేవల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో దంపతులు సామూహిక అభిషేక పూజలు, వృద్ధ మల్లికార్జునుడికి బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనల్లో పాల్గొన్నారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం సాయంత్రం సహస్ర దీపార్చన ఘనంగా నిర్వహించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్న దీపాలంకరణ మండపంలో తొలుత స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి ప్రదోషకాల సమయంలో లోక కల్యాణార్థం సంకల్పం పటించారు. అనంతరం అనంతరం వేదపండితులతో పాటు ధర్మకర్తల మండలి సభ్యురాలు విజయలక్ష్మి – సుబ్బరాయుడు దంపతులు దీపాలను వెలిగించారు.
సహస్ర దీపాలంకరణ మధ్య దివ్యంగా దర్శనమిచ్చే స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆ తర్వాత ప్రదోష కాలంలో ఆదిదేవులను వెండి రథంపై అధిష్టింప చేసి ఆలయ ప్రదక్షిణలు చేశారు. మేళతాళాలతో వైభవంగా సాగిన వెండి రధోత్సవంలో శాశ్వత కల్యాణ దాతలు, నిత్య కల్యాణ దాతలతో పాటు సామాన్య భక్తులు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
దక్షణ మాడవీధి హరిహరరాయ గోపురం వద్ద ధర్మపథంలో నిర్వహించిన భాగంగా హైదరాబాద్కు చెందిన వీఎన్ఆర్ కళాక్షేత్రం సంగీతవిభావరి శాంభవి డాన్స్ అకాడమీచే సంప్రదాయ నృత్యాలు భక్తులను అలరించాయి. కళాకారులను ప్రోత్సహంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని అధికారులు తెలిపారు.