తిరుపతి : చెన్నైలోని ఐలాండ్ మైదానంలో శ్రీనివాసకల్యాణం కన్నుల పండువగా జరిగింది. వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ఘట్టం ముగిసింది.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్. ఎన్ .రవి, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులు, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, టీటీడీ పాలకమండలి సభ్యులు, స్థానిక సలహా మండలి చైర్మన్ శేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈవో సురేష్ కుమార్ , అధికారులు, భక్తులు పాల్గొన్నారు.