బ్రహ్మ, విష్ణు, శివ తత్తాలు మూర్తీభవించిన జ్ఞానమూర్తి దత్తాత్రేయ స్వామి. అవధూత సంప్రదాయానికి ఆదిదేవుడిగా వెలిసిన గురు స్వరూపం. మహాభాగవతం ప్రకారం పరమాత్మ 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారం కూడా ఒకటి. తెలంగాణలో దత్త సంప్రదాయం ఊరూరా కనిపిస్తుంది. ఆ స్వామి వెలిసిన పుణ్యస్థలి కొడవటూరు. మార్గశిర పౌర్ణమి సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరులోని సిద్ధులగుట్టపై ఉన్న శ్రీ సద్గురు సదానంద దత్తాత్రేయ సిద్ధాశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో సిద్ధాశ్రమం 22వ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ స్వామి దివ్య అనుగ్రహంతో, జీర్ణ దేవాలయోద్ధారకులు యతివర మదనానంద సరస్వతీ స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం దత్త జయంతి ఉత్సవాలు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాది క్రతువులో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు, మంగళవారం గురుగీతా హోమం నిర్వహించనున్నారు. బుధవారం దత్తజయంతిని పురస్కరించుకొని మూలమంత్ర హవనం జరగనుంది. కొడవటూరులో కొండంత దైవంగా నిలిచిన దత్తాత్రేయుడి సేవలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొనాలని సిద్ధాశ్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు.