Gaura Purnima | కలియుగంలో సంకీర్తన ఉద్యమానికి నాంది పలికిన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు మేలిమి బంగారు ఛాయతో అవతరించిన కృష్ణ అవతారం. చైతన్య మహాప్రభు అవతరించిన ఫాల్గుణ పౌర్ణమి గౌర పౌర్ణమిగా జరుపుకొంటారు. శ్రీమద్భాగవతం, మహాభారతం, వాయు పురాణం, నృసింహ పురాణం, చైతన్యోపనిషత్తు (అథర్వ వేదం) మొదలైన శాస్ర్తాలన్నీ ఈ కలియుగంలో అవతరించే శ్రీకృష్ణుడి అవతార స్వరూపాన్ని గురించి స్పష్టంగా తెలియజేశాయి.
కలియుగంలో భగవంతుడు అవతరించడం ఎంతో విశిష్టతతో కూడిన విషయమే అయినా, ఆ అవతార స్వరూపాన్ని గురించి పరిజ్ఞానం మాత్రం లోకంలో చాలా అరుదు. వారే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. వీరిని ‘గౌర హరి’, ‘గౌరాంగ’, ‘గౌర సుందర’ అని కూడా సంబోధిస్తారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే గౌరాంగుడిగా అవతరించారు. దీనిని ధ్రువీకరించేలా శ్రీమద్భాగవతం మహాప్రభు అవతారాన్ని ఇలా వివరించింది.
కృష్ణ వర్ణం త్విశాకృష్ణం సంగోపంగాస్త్ర పార్శదమ్
యజ్నైః సంకీర్తన ప్రాయైర్ యజంతి హి సుమేధసః
(శ్రీమద్భాగవతము 11.5.32)
‘ఈ కలియుగంలో ఆవిర్భవించి, సదా కృష్ణ నామాన్ని గానం చేసే భగవత్ అవతార మూర్తిని… మేధోసంపత్తి కలిగిన మనుషులు సామూహిక సంకీర్తనలతో ఆరాధిస్తారు. తన వర్ణం నలుపు కాకపోయినా, అతను సాక్షాత్తూ శ్రీకృష్ణుడే. ఆయన సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించడానికి తన అనుచరులతో కలిసి ఈ భూమిపై అవతరిస్తారు’.
సంభవామి యుగే యుగే
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతియుగంలోనూ అవతరిస్తాడని శ్రీమద్భాగవతం చెబుతున్నది.
ఆసన్వర్ణాస్త్రయో హ్యస్య గృష్ణాతోనుయుగం తనూః
శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః॥
(శ్రీమద్భాగవతం 10.8.13)
‘ఈ యశోదా తనయుడు ఒక్కో యుగంలో ఒక్కో రంగుతో కూడిన శరీరాన్ని కలిగి ఉండేవాడు. ఒకప్పుడు శుక్ల, ఇంకొకప్పుడు రక్త, ఇంకొకప్పుడు పీత వర్ణంతో ఉన్న ఇతడు ఇప్పుడు (ద్వాపర యుగంలో) నలుపు వర్ణం పొందాడు.’
పై శ్లోకానికి హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు ఇలా వ్యాఖ్యానించారు. ‘శ్రీమద్భాగవతంలోని పై శ్లోకము శ్రీకృష్ణుడి నామకరణ సమయంలో గర్గముని చెప్పినది. ఇతర యుగాల్లో శ్రీకృష్ణుడి అవతారాలు తెలుపు, ఎరుపు, పీత (పసుపు) వర్ణాలతో కూడినవ’ని గర్గ మునులు ఇక్కడ వివరించారు. వీటిలోని పీత వర్ణం శ్రీచైతన్య మహాప్రభువుల అవతార స్వరూపాన్ని వివరిస్తుంది. అంటే, గత కల్పాలలోని కలియుగాల్లో సైతం భగవంతుడు పసుపు వర్ణంతో అవతరించాడు అనటాన్ని ఇది నిరూపిస్తున్నది. భగవంతుడు వివిధ యుగాల్లో వివిధ వర్ణాకృతులలో అవతరిస్తారు. ఆ విధంగా, పీత వర్ణం సహా వివిధ భగవత్ అవతార సంబంధిత గుణాలతో భగవంతుడు శ్రీచైతన్య మహాప్రభువుగా అవతరించారని ప్రామాణికమైన సకల వైదిక శాస్ర్తాలు నిర్ధారించాయి’ అని ప్రభుపాదులు విశ్లేషించారు.
విష్ణు సహస్ర నామాల్లోని ‘సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ, వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచలశ్చలః’ శ్రీ చైతన్య మహాప్రభు అవతారాన్ని స్పష్టం చేస్తుంది. ‘మేలిమి బంగారు వర్ణ ఛాయతో అవతరించి, ముందుగా గృహస్థుడిగా పలు లీలలు చూపుతాడు. అత్యంత సుందరమైన దేహాంగాలతో కూడి చందన లేపనం కలిగి సువర్ణ శోభతో ప్రకాశిస్తాడు. తర్వాతి లీలల్లో సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి నిష్ఠాపరుడై, శాంత స్వభావంతో మెలుగుతాడు. భక్తి, సామర్యం కలిగి తానే ఒక దివ్య సన్నిధానమై అభక్తులకు వాగ్బంధనం చేస్తాడు’ అని పై శ్లోకానికి వివరణ.
శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు హరినామ సంకీర్తనాన్ని కలియుగంలోని ప్రధాన ముక్తిమార్గంగా ప్రబోధించిన భాగవతోత్తముడు. భగవంతునిపై ప్రేమను పెంపొందించుకోవడమే జీవన సాఫల్యానికి అత్యున్నత మార్గం. అందుకు సరళమైన విధానాన్ని బోధించడానికి కలియుగంలో అవతరించిన పరమ కారుణ్యమూర్తి శ్రీ చైతన్య మహాప్రభు. సుమారు 500 సంవత్సరాల కిందట పశ్చిమ బెంగాల్ నవద్వీప ధామంలో శచీ తనయుడై అవతరించిన మహాప్రభు భగవన్నామ సంకీర్తనమనే యజ్ఞంతో యుగధర్మాన్ని స్థాపించారు.
లక్షలాది గౌడీయ వైష్ణవులకు, హరేకృష్ణ భక్తి మార్గ అనుచరులకు గౌర పూర్ణిమ అంటే నూతన సంవత్సర ఆరంభం. గౌరాబ్ద శకం 538వది అయిన ఈ సంవత్సరం పరమ పవిత్రమైన శ్రీకృష్ణ దివ్యనామాన్ని సేవించడానికి మరో సదవకాశాన్ని అందిస్తున్నది. కలియుగంలో ముక్తిని పొందడానికి, యుగధర్మమైన హరినామ సంకీర్తనను బోధిస్తూ, శ్రీ చైతన్య మహాప్రభువు ప్రత్యేకంగా కింది మహామంత్రాన్ని జపించమని మనకు అందించారు. అదే ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే హరేరామ హరేరామ రామ రామ హరే హరే॥’ శ్రీచైతన్య మహాప్రభువు చిత్రపటాన్ని ముందు ఉంచి, నిత్యం 108 సార్లు ఈ హరేకృష్ణ మంత్రాన్ని జపిస్తే, వారు కలియుగ భవసాగరాన్ని సులభంగా దాటి తప్పకుండా శ్రీకృష్ణుడిని చేరగలుగుతారు.
…? శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి, 93969 56984