సాధారణంగా అనుబంధ దేవాలయాలకు ఆదరణ తక్కువ. చాలామంది భక్తులు ప్రధాన ఆలయంలోనే మూలమూర్తిని దర్శించుకుని అక్కడ అర్చనాదులు పూర్తి చేసుకుంటారు. అటు తర్వాత అనుబంధ ఆలయాల వద్ద దండం పెట్టుకుని వెళ్లడం చూస్తుంటాం. కాగా ఈ దేవాలయంలో మాత్రం మూలమూర్తితో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా భక్తులు తమ ఇష్ట కామ్యాలు తీర్చమంటూ ప్రదక్షిణలు చేసి మొక్కులు మొక్కే ఉపాలయమిది.
సికింద్రాబాద్ క్లాక్టవర్ సమీపంలోని శ్రీవెంకటేశ్వరాలయం చాలా పురాతనమైనది. ఇక్కడ ఉపాలయంగా ఉన్న శ్రీసుదర్శన భూవరాహ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి. రెండు శతాబ్దాల క్రితం అంటే 1823 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిజాం నవాబు వద్ద తహసీల్దార్గా పనిచేసిన గోవింద ముదలియార్ నిర్మించారట. కలియుగ దైవంగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీవెంకటేశ్వరస్వామి ప్రధాన దైవం కాగా, ఇక్కడి ఉపాలయంలోని వరాహస్వామి రూపం మాత్రం అరుదైనదిగా చెప్పాలి. సాధారణంగా భూవరాహ క్షేత్రాలు అరుదుగా ఉంటాయి. అందులో సుదర్శన చక్రంతో కూడుకుని ఉండటం వల్ల ఇది అత్యంత అరుదైన క్షేత్రంగా, మహిమాన్వితమైనదిగా వినుతికెక్కింది. భగవంతుడిని వరాహ రూపంలో కొలిచే ఈ దివ్యక్షేత్రంలో భూమిని రక్షించే వరాహస్వామితో పాటు సుదర్శనచక్రం కూడా పూజలు అందుకోవడం విశేషం.
భూవరాహ స్వామిని దర్శించుకుంటే భూమి కొనుగోళ్లు, గృహనిర్మాణాలు, ఆస్తి వివాదాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. స్వామివారికి ప్రదక్షిణలు చేసి వారి కోరికలు చెప్పుకుని కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా వస్తుంటారు భక్తులు. ఈ ఆలయంలో కంకణధారణ చేసి నియమనిష్టలతో స్వామివారిని పూజించడం ద్వారా భూ లావాదేవీల్లో భక్తుల సత్ కోరికలు నెరవేరుతాయని అర్చకులు చెబుతున్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం రాహు కాలంలో సుదర్శన భూవరాహస్వామికి అభిషేకం చేస్తారు. దీంతోపాటు వరాహస్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, మహాసుదర్శన హోమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
-రంగనాథ్ మిద్దెల, 9866573461