శ్రీశైలం : శ్రావణమాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. శుక్రవారంతో మొదలై ఆగస్ట్ 28వ వరకు జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
వేడుకల్లో భాగంగా ఆలయంలో అఖండ శివనామ భజనలు, ప్రతి రోజు మూడు విడతలుగా సామూహిక అభిషేకాలు ఉంటాయని ఈవో తెలిపారు. ప్రధానంగా రద్దీ రోజుల్లో గర్భాలయంలో అభిషేకాలు నిలిపివేయనున్నట్లు చెప్పారు. భక్తులకు అందుబాటులో ఉండే విధంగా లడ్డూ ప్రసాదాలు, అన్నదాన విభాగంలో ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ దర్శనాలలో మార్పులు చేస్తూ తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి.. ఉభయ దేవాలయాల్లో మహా మంగళహారతుల అనంతరం భక్తులకు సర్వదర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
శ్రావణ సోమవారాలు, శుక్రవారాల్లో అందరికీ స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు చెప్పారు. రెండు, నాలుగో శుక్రవారాల్లో ఉచితంగా వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు కూడా ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో లవన్న కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ ప్రధాన విభాగపు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.