శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం ఉదయం కుమారస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయంలో నందిమండపంలో కొలువైన నందీశ్వరునికి సంధ్యాసమయంలో ఈవో పంచామృతాభిషేకాలు, శుద్ధోదకాలు, ఫలోదకాలతో అభిషేకించి షోడషోపచార పూజలు వైభవంగా నిర్వహించారు. నందీశ్వరుడికి శెనగలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ప్రదోషకాలంలో క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు. కళారాధనలో భాగంగా కళాకారులచే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
మల్లన్న సన్నిధిలో ప్రముఖులు..
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు, రోడ్లు, భవన నిర్మాణశాఖ మంత్రి శంకర్ నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వారిని పీఆర్ఓ శ్రీనివాస్ రావు, ఏఈవో హరిదాస్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం.. ప్రాకార మండలంలో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
దేవస్థానానికి భక్తుల విరాళాలు, కానుకలు
దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. ప్రకాశం జిల్లా కస్యాపురం గ్రామానికి చెందిన రమాకోటేశ్వరరావు రూ.2,51,232 గోసంరక్షణ నిధికి, నెల్లూరు జిల్లా నాయుడుపల్లికి అంకయ్య తిరుపతి దంపతులు రూ.లక్ష నిత్యాన్నదాన పథకానికి ఆలయ అధికారులకు అందించారు. అలాగే ప్రకాశం జిల్లా బద్దిపూడి గ్రామానికి చెందిన కూనం రాఘవరెడ్డి ట్రాక్టర్ను దేవస్థానానికి కానుకగా సమర్పించారు. రూ.5.20లక్షల విలువైన ట్రాక్టర్ను ఈవోకు అందజేశారు. దాతలు వాహనానికి క్షేత్రపాలకుడు బయలు వీరభద్ర స్వామి వద్ద పూజాధికాలు నిర్వహించి దేవస్థానానికి అందించారు. ఈ సందర్భంగా దాతలతో ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలు కల్పించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.