విష్ణువు శయ్య ఆదిశేషుడు. వాహనం పక్షీంద్రుడు. ఈ రెండిటికీ ఆజన్మవైరం. జాతివైరం. కానీ, ఈ రెండు జాతులూ మానవాళికి సాయపడేవే! ఈ ఇద్దరి కథా మనకు ధర్మం బోధించేదే! నాగుల పంచమి, గరుడ పంచమి సందర్భంగా ఈ జంటశక్తులను ఆరాధిద్దాం.
మనిషికి పామంటే భయం. దానివల్ల ఏర్పడ్డ శత్రుత్వంతో పాము కనబడగానే ఏదోవిధంగా దాన్ని చంపాలనుకుంటాడు మనిషి. పర్యావరణ సంతులనానికి ప్రతీ జీవి తనవంతు పాత్ర పోషిస్తుంటుంది. పాములు మనుషులకు చేసే మేలును జ్ఞాపకం చేసుకునేందుకు వీలుగా మనం ఈ పండుగలను చేసుకుంటాం. సర్పాలను ప్రముఖంగా పూజించే పండుగలు మూడు ఉన్నాయి. అవి శ్రావణ శుద్ధ పంచమి, కార్తిక శుద్ధ చవితి, మార్గశిర శుద్ధ షష్ఠి. వీటిని వరుసగా నాగుల పంచమి, నాగుల చవితి, సుబ్బారాయుడి షష్ఠి అని పిలుస్తారు.
పామును చూడగానే వెన్ను జలదరిస్తుంది. జలదరించేది వెన్ను కాదు.. అది వెన్నుపాము. షట్చక్రాలను కలుపుతూ ఉండే పామువంటి నరాల కట్ట. మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు వ్యాపించి ఉండే వెన్నుపాములోని ప్రతి కణం జాగృతం కావడమే కుండలినీ శక్తి మేల్కొనడం. కుండలినీ శక్తితో జాగృతమమయ్యే ప్రకృతికి పాము రూపంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతీక. ఈయనే శివుడి కుమారుడైన కుమారస్వామి.. ప్రజ్వలించే అగ్ని. దేహంలోని అగ్ని నిరంతరమూ చైతన్యవంతంగా ప్రజ్వరిల్లడమే యజ్ఞం. సర్పం మానవుడి దైహిక కామనలకు కూడా ప్రతీక.
భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా, సంతానాన్ని పొందాలన్నా నాగదేవతను పూజించాలి అని చెబుతారు. కంటి సమస్యలు, వినికిడి లోపాలు కూడా నాగార్చనతో సమసిపోతాయని విశ్వసిస్తారు. నాగుల పంచమి సందర్భంగా మగవాళ్లు తమ తోబుట్టువుల ఇండ్లకు వెళ్లి, ఆవుపాలతో తమ కండ్లను కడిగించుకునే సంప్రదాయం తెలంగాణలో కనిపిస్తుంది. భగవద్గీత విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ‘నేను నాగులలో అనంతుడను, సర్పాలలో వాసుకిని’ అని పేర్కొన్నాడు. సర్పజాతి అంతటినీ పాములుగా వ్యవహరిస్తున్నా.. సర్పాలు వేరు, నాగులు వేరు అన్న విషయాన్ని గుర్తించాలి.
ఇదే శ్రావణ శుద్ధ పంచమి గరుత్మంతుడి జన్మదినం. కాబట్టి, దీన్ని గరుడ పంచమిగానూ వ్యవహరిస్తారు. తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు గరుత్మంతుడు ఇంద్రాదులను ఓడించి, మహావిష్ణువు మెప్పుపొంది అమృతాన్ని సాధించి నాగులకు ఇచ్చాడు. గెలుచుకొని వచ్చిన అమృతాన్ని తాను తాగలేదు. తనవారికీ ఇవ్వలేదు. లోక కల్యాణార్థం అమృతాన్ని సర్పాలు సేవించకముందే ఇంద్రుడు సంగ్రహించే వెసులుబాటు కలిగించాడు. అపారమైనశక్తికి, నిస్వార్థ శీలానికి గరుత్మంతుడు ప్రతీక. ఈ కారణం వల్లే పక్షీంద్రుడు అమృతపానం చేయకుండానే మృత్యువు లేనివాడు అయ్యాడు. విష్ణుమూర్తికి వాహనమయ్యాడు. ధ్వజమయ్యాడు.
గరుత్మంతుడి కథ అంతా ప్రతీకాత్మకమే! కద్రువ, వినత.. తల్లులు ఎలా ఉండకూడదో చెప్పేందుకు ఉదాహరణ. మాత్సర్యం కారణంగా తమ పిల్లలకు తామే కష్టాలు కొనితెచ్చారు. అనూరుడు కాళ్లులేని వాడయ్యాడు. సర్పాలన్నీ సర్పయాగంలో పడి మాడి మసైపోయాయి. కద్రువ, వినత ఇద్దరూ దక్ష ప్రజాపతి కూతుళ్లు. కశ్యప ప్రజాపతి భార్యలుగా సవతులు. అక్కాచెల్లెళ్లకు బాల్యంలో ఏర్పడిన ఈర్ష్య, అసూయలు సవతులలో మాత్సర్యంగా మారి వారి కష్టాలకు కారణాలయ్యాయి.
ఇంద్రాదులను జయించడానికి బయల్దేరుతున్న గరుత్మంతుడికి అపారమైన శక్తి అవసరం. అందుకోసం లోకకంటకులైన నిషాదులను (పుళిందులను) భుజించమని వినత తన కొడుకుకు చెప్పింది. తండ్రి కశ్యపుడు నిరంతరమూ తగువులు పెట్టుకుంటున్న ఏనుగును, తాబేలును తినమని చెప్పాడు. ఈ రెండు అంతకుముందు జన్మలో అన్నదమ్ములు. వారి పేర్లు విభావనుడు, సుప్రతీకుడు. తండ్రి ఆస్తిని పంచుకునే క్రమంలో జరిగిన దెబ్బలాటల్లో మరణించి గజకచ్ఛపాలు అయ్యారు. జన్మలు మారినా వైరం మరువలేదు. ఒకరిపై ఒకరికి శత్రుభావం తీరలేదు.
ఈ గజకచ్ఛపాలను కాళ్లతో అందుకొని, తినడానికి గరుత్మంతుడు వాలిన ‘రోహిణి’ వృక్షశాఖ విరిగిపోయింది. ఆ చెట్టుకొమ్మకు వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలఖిల్యాది మహర్షులకు తపోభంగం కలగకుండా తండ్రి సాయంతో వారిని క్షేమంగా మరోచోట దింపాడు. వృక్షశాఖను ముక్కున కరుచుకొని వేలాది మైళ్లు పయనించాడు గరుత్మంతుడు. లోక కల్యాణార్థం తపస్సు చేస్తున్న మునులకు హాని కలగరాదని భావించాడు. అందుకు తగ్గట్టుగా వ్యవహరించాడు. దక్షతగల వాళ్లు ఎలా ఉండాలనేదే ఈ కథలోని నీతి. గరుడ పంచమి సందర్భంగా అటు నాగులను, ఇటు గరుత్మంతుడిని పూజించి ఆయా శక్తులను ప్రోది చేసుకోవడమే మనం చేయాల్సింది!
వరిగొండ కాంతారావు …?
9441886824