శ్రీశైలం : మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నిత్యం విశేషపూజలు జరుగుతాయని చెప్పారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఆలయ ప్రాకారోత్సవం (మాడ వీధుల చుట్టూ ఊరేగింపు) నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశస్థాపన, వేదపారాయణాలుతో పాటు ప్రత్యేక పూజాధికాలు జరుగుతాయని తెలిపారు.
సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. మకర సంక్రమణం రోజున గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి కల్యాణం ఆలయ సాంప్రదాయం ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల చివరి రోజున పుష్పోత్సవసేవ, శయనోత్సవ సేవ ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. శ్రీశైల క్షేత్రంలో జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి అమ్మవార్ల ఆర్జిత, పరోక్ష సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో ప్రకటించారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగు రంగు విద్యుద్దీపాల వెలుగుల్లో ఆలయం కాంతులీనుతున్నది.
సామూహిక భోగి పండ్లు.. ముగ్గుల పోటీలు
మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో భోగి పర్వదినాన ఉదయం 10 గంటలకు అక్కమహాదేవి అలంకార మండపంలో ఐదు సంవత్సరాల వయస్సులోపు చిన్నారులకు ఉచిత సామూహిక భోగిపండ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. అదే విధంగా సంక్రాంతి పండుగ రోజున మహిళలకు ప్రత్యేకంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇందులో స్థానికులతోపాటు భక్తులు కూడా పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు.