తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదో రోజైన మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీనివాసుడు శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఆ పక్కనే దంతపు వాహనంపై వెన్నముద్ద కృష్ణుడిగా కూడా స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ముగ్ధమనోహర మోహిని, ఆ వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు.
మాయా జగత్తు నుంచి భక్తులను బయటపడేయటమే మోహినీ రూపం పరమార్థం. స్వామివారి వైభోగాన్ని భక్తులు కనులారా వీక్షిస్తున్నారు. మాడ వీధుల్లో భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి గరుడ వాహన సేవ జరుగనుంది.