TTD | తిరుమల వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. పలురకాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో సప్తగిరులను తలపించేలా మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా మొదట శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్పస్వామి వారు మాడవీధుల్లో ఊరేగారు. ఆ తర్వాత వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది.
ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
ఆ అనంతరం స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవాల సందర్భంగా వసంతమండపాన్ని శేషాచల అడవులను తలపించేలా తీర్చిదిద్దారు. 250 కేజీల వట్టి వేరు, 600 కేజీల సాంప్రదాయ పుష్పాలు, 10వేల కట్ ఫ్లవర్స్తో సుర్వాంగ సుందరంగా రూపొందించారు. పచ్చని చెట్లు, పుష్పాలతోపాటు పలురకాల జంతువుల ఆకృతులను ఏర్పాటు చేశారు. పులి, చిరుత, కోతులు, పునుగుపిల్లి, కొండచిలువ, కోబ్రా, నెమలి, హంసలు, బాతులు, హమ్మింగ్ బర్డ్, మైనా, చిలుకలు ఉన్నాయి. ఇవి భక్తులను అలరించాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం మలయప్పస్వామి వారు స్వర్ణ రథంపై నుంచి భక్తులను అనుగ్రహించనున్నారు.