ఓ భక్తుడు రమణ మహర్షితో ‘పది సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తున్నాను. మీరు సూచించిన సాధనలన్నీ చేస్తున్నాను. అయినా ఎందుకు ఆధ్యాత్మికంగా ఏ అభివృద్ధీ నాలో కనిపించటం లేదు?’ అని వాపోయాడు. అప్పుడు రమణులు ‘కాశీకి వెళ్లటానికి ఒకరు మొదటి తరగతిలో కూర్చొని గార్డుతో ‘కాశీలో నన్ను నిద్రలేపండి’ అని చెప్పాడు! తర్వాత కిటికీలు మూసుకొని పడుకున్నాడు.
మధ్యలో నిద్ర లేచి ‘అయ్యో! కాశీ దాటిపోయిందేమో? ఇప్పుడెలా?’ అని భయపడే వ్యక్తిని వివేకి అంటారా? తన పని గార్డుకు చెప్పటం మాత్రమే! గార్డు పని గార్డు చూసుకుంటాడు కదా! భక్తులు మొదటి తరగతి ప్రయాణికులు. భగవంతుడే గార్డు. భవబంధాలన్నింటినీ దాటించే బాధ్యతను ఆయన తీసుకోడా? సందేహం ఎందుకు? అని మహర్షి విస్పష్టం చేశాడు.
– మనోజ్ఞ