Ayodhya | ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలకు జరుగనున్నాయి. రామయ్య జన్మదినోత్సవ వేడుకలు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీరామనవమికి అయోధ్యకు రాకుండా ఇంటి వద్దనే ఉండి ప్రత్యప్రసారం ద్వారా వేడులకను వీక్షించాలని కోరింది. ఈ మేరకు రామ నవమి నాడు అయోధ్యలో జరిగే పూజ-హారతి కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లోనే బాల రాముడిని దర్శించుకోవాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఉత్సవాల తర్వాత రద్దీ తగ్గుతుందని.. ఆ తర్వాత బాల రామచంద్రస్వామిని దర్శించుకోవాలని తెలిపింది. రామ జన్మభూమిలోని ఆలయం నిర్మించగా.. తొలిసారిగా కొత్తగా నిర్మించిన ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు జరుగనున్నాయి. ఈ క్రమంలో లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని అంచనా. ఈ క్రమంలో రద్దీని నియంత్రించేందుకు ట్రస్ట్ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ సారి రామనవమి రోజు దాదాపు 5లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రస్ట్ హారతి, దర్శనం వేళల్లో మార్పులు చేసింది. రాత్రి వరకు గర్భాలయంలో దర్శనాలు కొనసాగుతాయని ట్రస్ట్తో అనుబంధం ఉన్న విశ్వహిందు పరిషత్ నాయకుడు ఒకరు తెలిపారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని.. మధ్యమధ్యలో కొంతసేపు బాల రామయ్యకు సేవలు చేసేందుకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. మరో వైపు శ్రీరామనవమి సందర్భంగా ట్రస్ట్ ఈ నెల 16 నుంచి 19 వరకు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ పాస్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.