Pushpa Pallaki | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ కనుల పండువగా సాగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. పల్లకీ మందుభాగంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, పక్క భాగంలో ద్వాపరయుగంలో చిన్నికృష్ణులు, వెనుక భాగంలో తమలపాకుల ప్రత్యేక అలంకరణలో హనుమంతుని ప్రతిమలను కొలువుదీర్చారు.
ఆరు రకాల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు వినియోగించారు. ఈరోడ్కు చెందిన దాత సెంగుట్టవన్ సహకారంతో పల్లకీ పుష్పాలంకరణ చేపట్టారు. కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, పేష్కార్ శ్రీహరి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వీజీవో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.