అరబ్ సామ్రాజ్యంలో ఖలీఫా ఉమర్ (రజి) పరిపాలనా కాలమది. రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. క్షామంతో ఎవరూ సరైన తిండికి నోచుకోలేకపోయారు. ఖలీఫా ఉమర్ (రజి) తన ఖర్చులన్నిటినీ తగ్గించుకున్నారు. కరువు దూరమయ్యేంత వరకూ పాలు, నెయ్యి, మాంసం ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. కొన్ని రోజులు గడిచాయి. అంగట్లోకి పాలు, నెయ్యి అమ్మకానికి వచ్చాయి. సేవకుడు వాటిని కొనుగోలు చేసి ఖలీఫా ముందుంచాడు. ‘ఇవన్నీ ఎక్కడివి?’ అని అడిగారు ఖలీఫా.
బజారులో ఇవన్నీ అమ్మకానికి వచ్చాయంటే ప్రజల స్థితిగతులు మెరుగుపడ్డాయని అర్థం’ అని చెప్పాడు సేవకుడు. దానికి ఖలీఫా ‘ఖరీదైన వస్తువులు, పదార్థాలన్నీ ప్రజలకు అందుబాటులోకి రానంత కాలం నేను వీటిని ముట్టేది లేదు. అందుకోసం ఎన్నాళ్లయినా వేచి చూస్తాను’ అన్నారు. ఈ పాలు, నెయ్యి ఎవరికైనా పంచమని చెప్పారు. ప్రవక్త కాలంలో పాలకులను చక్రవర్తి, రాజు అని సంబోధించేవారు కాదు. ఖలీఫా అని పిలిచేవారు. ఖలీఫా అంటే అల్లాహ్ ప్రతినిధి అని అర్థం. పాలనా వ్యవహారాల్లో అల్లాహ్ చూస్తున్నాడు అనే స్పృహతో పరిపాలన చేయాలని ముహమ్మద్ ప్రవక్త ప్రబోధించారు.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076