శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా ఈవో లవన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. సోమవారం ఉభయ దేవాలయాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు విశేషార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పరివార దేవతామూర్తులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం ప్రదోషకాల పౌర్ణమి గడియల్లో భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఊయల సేవను జరిపించారు.
అమ్మవారి ఆలయ ప్రాకారమంతా ప్రత్యేక పుష్పాలంకరణతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఊయలలో ఆశీనులైన స్వామి అమ్మవార్లకు అర్చక వేదపండితులు షోడశోపచార క్రతువులు జరిపి, లలితా సహస్త్రనామ పఠనంతో కుంకుమార్చన నిర్వహించారు. లోక కల్యాణార్థం పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహించే లక్షకుంకుమార్చన పూజావిధిలో భక్తులు కూడా పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించగా వివిధ ప్రాంతాల నుంచి సేవల్లో పాల్గొన్నారు.
విదేశాల్లో ఉన్న భక్తుల అభ్యర్థన మేరకు అమ్మవారికి జరిగే పౌర్ణమి ప్రదోషకాల పూజల్లో పరోక్షంగా పాల్గొనే అవకాశం కల్పించిన దేవస్థానం నిర్ణయానికి పలువురు దాతలు హర్షం వ్యక్తం చేసినట్లు లవన్న తెలిపారు. అదేవిధంగా భ్రమరాంబాదేవి మల్లికార్జున స్వామి అమ్మవార్లకి పల్లకీ సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి ప్రాకార మండపంలో వివిధ రకాల పూలతో అలంకరించిన పల్లకిలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి.. వేదపండితులు అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు గర్భాలయం చుట్టు మూడు ప్రదక్షిణలు చేశారు.