తిరుమల జిల్లా : శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 8 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే కొన్ని దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962 నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 8న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 9న పవిత్ర సమర్పణ, ఆగస్టు 10న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి.
పవిత్రోత్సవాల్లో ఆర్జితసేవలు రద్దు
పవిత్రోత్సవాల్లో ఆగస్టు 7న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్ధు చేసింది. అదేవిధంగా, ఆగస్టు 9న అష్టాదళ పాదపద్మారాధనతోపాటు ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.
29 న శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 29 న శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం తిరుమల నుంచి శ్రీవారి అప్పాపడి ప్రసాదాన్ని తిరుపతిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి సాత్తు మొర నిర్వహిస్తారు. శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ సంస్కృత పండితులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతంతోపాటు స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనమును అద్భుతంగా రచించారు. శ్రీ భాష్యం, శ్రీ భాగవతం వంటి మహా గ్రంథాలకు వ్యాఖ్యానం రచించారు. వీరి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరోజున సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.