పన్నెండేళ్లకే సంస్కృత భాగవతాన్ని ఆపోశన పట్టిన పరమ భాగవతుడు. అంతే కాదు, వ్యాస మహర్షి రచించిన భాగవతాన్ని మరాఠీ భాషలోకి అనువదించిన వాడు. అలాంటి ఏకనాథ్ ఒకసారి తన స్నేహితులతో కలసి హరిద్వార్ వెళ్లాడు. అక్కడినుంచి కావిళ్లలో గంగాజలాన్ని నింపుకొని రామేశ్వరం బయల్దేరుతాడు. ఆ గంగోదకంతో రామేశ్వరుణ్ని అభిషేకించటం పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ఆ ఆనవాయితీలో భాగంగానే ఏకనాథ్ కూడా కావిళ్లలో గంగాజలాన్ని పట్టుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే అనావృష్టి కారణంగా మార్గమధ్యంలో ఎక్కడ చూసినా కరువే కనిపించింది. ప్రజలు తాగటానికి కూడా నీళ్లు లేక అల్లల్లాడుతూ ఉంటారు. ఇక పశుపక్ష్యాదుల సంగతి చెప్పనవసరం లేదు. అలా జలాభావంతో ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోవటం ఏకనాథ్ మనసును కలచివేస్తుంది.
ఒకరోజు మార్గంలో ఒక గాడిద దాహంతో ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఆ భక్తాగ్రేసరుడి దృష్టిలో పడుతుంది. అది చూసిన ఏకనాథ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తన దగ్గర ఉన్న గంగాజలాన్ని ఒక పాత్రలో పోసి గాడిద ముందు ఉంచాడు. ఆ మూగజీవి నీరు తాగి, నెమ్మదిగా అక్కడినుంచి బయల్దేరింది. అది చూసి ఏకనాథ్ ఎంతో సంతోషిస్తాడు. కానీ, ఏక్నాథ్ వెంట ఉన్న మిత్రులు కాస్త నిష్ఠురంగా ‘నువ్వు నీ కుండలోని పవిత్ర జలాన్నంతా ఆ గాడిద పాలుచేశావు. ఇక రామేశ్వరం వెళ్లి శివుడికి ఏం అభిషేకం చేస్తావు?’ అని అడుగుతారు. అప్పుడు ఏకనాథ్ ఎంతో అమాయకంగా ‘ఏం మీరంతా ఉన్నారుగా! అభిషేకానికి మీ దగ్గర ఉన్న గంగాజలాన్ని కొంచెమైనా ఇవ్వరా?’ అంటాడు. వెంటనే ఆ స్నేహితులు ‘ఇస్తాం లే! కానీ హరిద్వార్ నుంచి స్వయంగా తెచ్చిన నీటితో అభిషేకం చేస్తేనే నీకు పుణ్యం కదా!?’ అంటారు. అప్పుడు ఏక్నాథ్ ‘ఏం చెయ్యమంటారు! దాహంతో అలమటిస్తున్న మూగజీవిని చూసినప్పుడు, నాకు రామేశ్వరంలో ఉన్న శివుడే కనిపించినట్లయింది. ఆయన దర్శనమిచ్చి ‘నేను ఇక్కడ దప్పికతో ప్రాణం పోయే స్థితిలో ఉంటే, మీరు నా అభిషేకానికి నీరు తీసుకొని రామేశ్వరం వెళుతున్నారా!’ అని నిలదీసినట్లు అనిపించింది. అందుకని ఆ నోరు లేని జీవానికి నీళ్లు ఇవ్వకుండా ఉండలేకపోయాను’ అన్నాడు. ఏకనాథ్ జీవకారుణ్యానికి ఆ మిత్రులు కదిలిపోయారు.
…?మనోజ్ఞ