తిరుమల : తిరుమలలో పల్లవోత్సవం వైభవంగా నిర్వహించారు. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. మైసూర్ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్బాబు, పేష్కార్ శ్రీహరి, పార్ పత్తేదార్ తులసీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి ఈ పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తూవస్తున్నది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అని పిలిచేవారు. శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తి భావంతో భూరి విరాళాలు అందించారు. ఇందులో భాగంగా మూలవిరాట్టుకు, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, ప్లాటినం, బంగారు, వజ్రలు, కెంపులు, పచ్చలు, మకరం తదితర అముల్యమైన అభరణాలు బహూకరించారు. అదేవిధంగా బ్రహ్మూత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలను కూడా మైసూరు మహారాజు అందించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ఆయన ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి ఇచ్చారు.
ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతి రోజు 5 కేజిల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా.. అది ఇవాల్టికీ కొనసాగుతున్నది. అలాగే, శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావలి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్లోత్సవం రోజున కూడా శ్రీమలయప్పస్వామి కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవం అనంతరం ఆలయానికి చేరుకుంటారు.