Padmavathi Vasanthotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 4 నుంచి మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు 3న అంకురార్పణ జరుగనున్నది. ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులకు టీటీడీ అవకాశం కల్పించింది. రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఉత్సవాల్లో భాగంగా 5న ఉదయం ఉదయం 9.10 గంటలకు స్వర్ణ రథోత్సవంపై నుంచి అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంయి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో అమ్మవారు వివిధ వాహనాలపై వివరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు.
పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాల నేపథ్యంలో మే 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కొనసాగనున్నది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాల నేపథ్యంలో మే 2 నుంచి కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణసేవ, అష్టోత్తర శతకలశాభిషేకం, 5న లక్ష్మీపూజ ఆర్జితసేవలను దేవస్థానం రద్దు చేసింది.