TTD News | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం 7.10 గంటలకు రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.
రథోత్సవం అనంతరం రథ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. సాయంత్రం 5.30 నుంచి ఊంజల్సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
రథోత్సవంలో పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈఓ వీర బ్రహ్మం దంపతులు, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు బాబు స్వామితో పాటు టీటీడీ సిబ్బంది, ఆయలం అధికారులు పాల్గొన్నారు.