శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అమ్మవారి ఊయలసేవ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం భ్రామరి అమ్మవారికి వివిధ రకాల ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్ధనం, మల్లెలు, చామంతి పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఊయలలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి.. అర్చకులు సేవా సంకల్పాన్ని పఠించి.. అష్టోత్తర, త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్రనామాలతో షోడశోపచార పూజలు నిర్వహించారు.
దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణా నిధికి విజయవాడకు చెందిన హేమకుమార్ రూ.లక్ష విరాళంగా అందజేశారు. శుక్రవారం ఆలయ పర్యవేక్షకురాలు సాయికుమారికి విరాళాన్ని చెక్కురూపంలో అందించారు. అనంతరం దేవస్థానం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. స్వామి, అమ్మవార్ల కండువా ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. అలాగే దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన ప్రసాద విభాగానికి చీరాల భ్రమరాంబిక సేవా సమితి లక్ష విస్తారకులను విరాళంగా అందజేసింది. అన్నపూర్ణ భవనంలో దేవస్థానం అధికారులకు విస్తారాకులు, ఆరుటన్నుల కూరగాయలను అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి ప్రెసిడెంట్ ఎంవీఎస్ మహాలక్ష్మి, కార్యదర్శి శ్రీనివాస్, సమన్వయకర్తలు నాగేంద్రం, అప్పారావు, మల్లేశ్వరి, మణికుమార్, సత్య, రాము తదితరులు పాల్గొన్నారు.