పస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్
(రామాయణం- బాలకాండం- మొదటి శ్లోకం)
ఒకనాడు నారదుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. నారదుడిని సభక్తికంగా అర్చించిన వాల్మీకి.. ‘గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యనిష్ఠ కలవాడు, దృఢవ్రతుడు, సదాచార సంపన్నుడు, సర్వభూత హితుడు, సకలశాస్త్ర పారంగతుడు, సమర్థుడు, తన దర్శనంతో ఇతరులకు సంతోషం కలిగించేవాడు, ధైర్యశాలి, అరిషడ్వర్గాన్ని జయించిన వాడు, సకల శోభలతో ప్రకాశించేవాడు, అసూయ లేనివాడు, దేవ-అసురులను కూడా యుద్ధంలో భయభ్రాంతులకు గురి చేయగలిగిన వాడు ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారా? అని జిజ్ఞాసతో ప్రశ్నించాడట.
‘నారం దదాతి ఇతి నారదః’- అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు. అంతేకాదు.. నారదుడు నిరతస్వాధ్యాయి తపస్వి, వాగ్విదాంవరుడు, మునిపుంగవుడు. స్వాధ్యాయం అంటే తెలుసుకున్నదాన్ని ఎప్పుడూ మననం చేసుకోవడం, విశ్లేషించుకోవడం, కొత్త అంశాలను జోడించడం, అనవసరమైన అంశాలను తొలగించడం, అవసరమైతే సవరించుకోవడం.. ఇలా చేయడం వల్ల విషయ విశ్లేషణ, ఆధునికీకరణ సాధ్యపడుతుంది. ఇది కార్యసాధనలో నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. నారదుడు వాగ్విదాంవరుడు! వాక్కు నిరంతర ప్రవాహశీలి అయిన సరస్వతి. మితంగా, హితంగా సత్యవాక్కులతో ప్రకాశించేవాడు నారదుడు. ఏ మాటను ఎక్కడ, ఎలా, ఎంతవరకు మాట్లాడాలనే విజ్ఞత తెలిసినవాడు. ఆయన మునిపుంగవుడు. అంటే మునులలో శ్రేష్ఠుడు. మౌనంగా ఉండేవాడు ముని. మౌనంగా ఉండటం అంటే మాట్లాడకపోవడం కాదు! లక్ష్య సాధనకు సంబంధించిన అంశాలను నిరంతరం మననం చేసుకోవడం. మౌనం వల్ల మానసిక వికాసం కలుగుతుంది. సాధనాశక్తి పెరుగుతుంది. ఈ రెండిటి వల్ల మాటలో నియంత్రణ వస్తుంది. ఇవన్నీ సాధించినవాడు నారద మహర్షి.
శ్రేష్ఠత సాధనలో వాల్మీకి కొంతవరకు ప్రయాణించాడు. తనలో ఉన్న అస్పష్టతను అధిగమించేందుకు తపిస్తున్న తరుణంలో అర్హుడైన శిష్యుణ్ని వెతుక్కుంటూ నారదుడే గురువుగా, మార్గదర్శిగా వాల్మీకి దగ్గరికి వచ్చాడు. తనను అనుగ్రహించడానికి వచ్చిన నారదుడితో వాల్మీకి భౌతిక జీవితంలో అభ్యుదయాన్ని, ఆధ్యాత్మిక జీవితంలో శ్రేయస్సునూ పొందేందుకు అవసరమైన శ్రేష్ఠతకు సంబంధించిన లక్షణాలను ప్రశ్నించాడు. ఆ లక్షణాలు సార్వకాలికమై, సర్వజనీనమై రామాయణ మహాకావ్యంగా శాశ్వతత్వాన్ని సంతరించుకున్నాయి.
శ్రేష్ఠత అంటే ఏమిటి? చేస్తున్న పనిలో యోగ్యతను పెంచుకోవడం, పరిపూర్ణత సాధించడం! యోగ్యత, పరిపూర్ణతల ఉన్నతీకరణే శ్రేష్ఠత. ఆ గమనంలో మనం పాటించే విధివిధానాలు, సాధించే అసాధారణ ప్రజ్ఞాపాటవాలు శ్రేష్ఠతా సాధనకు మార్గాలుగా చెప్పుకోవచ్చు. చేస్తున్న కర్మలో శ్రేష్ఠత సాధించడం వల్ల నాణ్యమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. సరళమైన, కచ్చితమైన జీవన విధానంతో సమాజానికి మార్గదర్శులుగా ఎదుగుతాం. తెల్లవారితే పట్టాభిషేకం అన్నారు. శ్రీరాముడు పొంగిపోలేదు. మర్నాడు 14 ఏండ్లు వనవాసానికి వెళ్లాలన్నారు. ఆ మాట విని కుంగిపోలేదు. అరణ్యవాస సమయంలో దానికి కారణమైన తండ్రిని కానీ, కైకేయిని కానీ ఏనాడూ విమర్శించలేదు. తన కర్తవ్యాన్ని ఉపాసనగా నిర్వహించాడు. శ్రేష్ఠతను జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు కాబట్టే రాముడు యుగపురుషుడు అయ్యాడు. నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాడు.
…? పాలకుర్తి రామమూర్తి