చేపగా వచ్చి.. చేవను చూపి.. లోకాలను కాపాడటానికి శ్రీహరి అనేక అవతారాలను దాల్చాడు. అందులో మొదటిది మత్స్యావతారం. చేపగా వచ్చి.. చేవ చూపి.. వేదాలను కాపాడిన పర్వదినం చైత్ర శుక్ల పంచమి. వైవస్వతుడు సూర్యుడి కొడుకు. మనువు కాకముందు ఆయన పేరు సత్యవ్రతుడు. ద్రవిడ దేశాన్ని ధర్మంగా పాలించేవాడు. రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి మలయపర్వతంపై చాలాకాలం తపస్సు చేశాడు. సత్యవ్రతుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ప్రళయకాలంలో ప్రాణులందరినీ రక్షించే శక్తిని అనుగ్రహిస్తాడు. ఒకరోజు కృతమూల నదిలో తర్పణం వదులుతూ ఉంటే సత్యవ్రతుడి దోసిట్లో ఓ చేప పడుతుంది.
దానిని మళ్లీ నీటిలో వదులుతాడు. ‘జలచరాలు తింటాయని నాకు భయం’ అంది చేప. ‘రక్షిస్తావని నీ దోసిట్లోకి వస్తే, మళ్లీ నీళ్లలో వదులుతావా!’ అంటుంది. అప్పుడు రాజు చేపను తీసుకొని కమండలంలో వేసి తీసుకెళ్తాడు. చూస్తుండగానే చేప పరిమాణం పెరుగుతుంది. దానిని మరో జలపాత్రలో వేస్తాడు రాజు. క్షణాల్లో చేప పరిమాణం ఆ పాత్ర మేరకు పెరుగుతుంది. బావిలో, చెరువులో, పెద్ద సరోవరంలో వేసి చూశాడు. దాని పరిమాణం పెరుగుతూ పోయింది. చివరకు సముద్రంలో వదిలాడు. కడలినంతా ఆక్రమిస్తూ చేప పెరిగిపోయింది. ఆ మాయ అంతుబట్టక ‘ఎవరు నీవు?’ అని అడుగుతాడు రాజు. అప్పుడు ఆ మీనం ‘నేను విష్ణుమూర్తిని. ఇవాళ్టికి ఏడో రోజున ప్రళయం ముంచుకొస్తుంది. ముల్లోకాలూ నీటిలో మునిగిపోతాయి.
చిమ్మచీకటి కమ్ముకుంటుంది. నీ దగ్గరికి ఒక పెద్ద నౌక వస్తుంది. సూక్ష్మ శరీరాలతో సమస్త ప్రాణులను, సమస్త ఔషధులను, సప్త రుషులతో ఆ పడవను ఆశ్రయించు. నేను మత్స్య రూపంలో వస్తాను. ఒక మహా సర్పం కనిపిస్తుంది. దాన్ని తాడుగా చేసి నావను, నా కొమ్ముకు బంధించు. నేను రక్షిస్తాను’ అంటాడు. సత్యవ్రతుడు ఏదో అడగబోతుంటే.. ‘సృష్టి పునఃప్రారంభం తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెబుతాను. తర్వాతి సృష్టికి నీవే ప్రజాపతివి’ అని మాయమైంది. తర్వాత ఏడు రోజులకు విష్ణుమూర్తి మత్సరూపధారిగా వారిని రక్షిస్తాడు. తర్వాత సత్యవ్రతుడికి బ్రహ్మతత్తాన్ని ఉపదేశిస్తాడు. వేదాలను రక్షించి రాజుకు అప్పగిస్తాడు. మత్స్య నారాయణుడు అందించిన వేదజ్ఞానమే మానవ నాగరికతకు మూలం.
– విష్ణువర్ధన్