శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు భ్రమరాంబ అమ్మవారితో కలిసి రథంపై శ్రీశైల వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి దాదాపు రెండులక్షల మంది వీక్షించినట్లు అంచనా. మంగళవాయిద్యాలు, ఢమరుకనాదాలతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం నయనానందకరంగా సాగింది.
రథోత్సవానికి ముందుగా ఆలయ ప్రాంగణం నుంచి స్వామి అమ్మవార ఉత్సవమూర్తులను పల్లకీలో తోడుకుని వచ్చారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం రథాంగపూజ, హోమం, రథాంగబలి కార్యక్రమంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి స్వామి అమ్మవార్లకు సాత్వికబలి సమర్పించారు. రథోత్సవాన్ని వీక్షించడం ద్వారా సర్వపాపాలు కష్టాలు తొలిగి ఆయురారోగ్య ఐశ్వార్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. విద్యుద్దీపాలంకరణ, సౌండ్సిస్టమ్, వాటర్ ఫౌంటెయిన్లను వీక్షించిన యాత్రికులు సెల్ఫీలతో హడావుడి చేశారు.
అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పూజలందుకున్న స్వామిఅమ్మవార్లను ఆలయ పుష్కరిణి వద్దకు తోడ్కొనివచ్చి పుష్పాలంకరణ చేసిన తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న తదితరులు పాల్గొన్నారు.