శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోతున్నది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులు కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలకు బారులుదీరుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూడుగంటల సమయంపడుతున్న అలంకార దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఈవో లవన్న తెలిపారు.
ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందినవారికి, రిస్ట్బ్యాండ్లతో కాళినడకన శ్రీశైలం చేరుకునే యాత్రికులతోపాటు ఇరుముడి శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల్ ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంవల్ల ఆలయం తెరిచినప్పటి నుంచి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు మజ్జిగ అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. కాలినడక శివస్వాములకు భక్తులకు మార్గమధ్యలో అన్నదానాలు మంచినీటిని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు దేవస్థానం తరఫున వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలనడక భక్తులకు ప్రత్యేక కంకణాలను ఏర్పాటు చేసి శ్రీఘ్ర దర్శనం క్యూలైన్ల ద్వారా కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా నాలుగు క్యూలైన్ల ద్వారా దర్శనాలను ఏర్పాటు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. భక్తులకు ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా శీఘ్ర (రూ.200), అతి శీఘ్ర (రూ.500), శివస్వాములు, పాదయాత్ర భక్తులకు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. నృత్య నివేదన శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా క్షేత్ర పరిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకురులు కూచిపూడి, భరతనాట్యం, హరికథా సంగీత కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు భ్రామరీ కళావేదికతోపాటు శివదీక్షా శిబరం, పుష్కరిణి వద్ద ప్రదర్శనలు ఇస్తున్నారు. శివరాత్రికి రెండు రోజులు ముందుగానే పెరిగిపోతున్న ట్రాఫిక్ను సరళీకృతం చేయాలని ఈవో లవన్న సంబంధిత అధికారులకు సూచనలిచ్చారు. ప్రధానంగా టోల్గేట్ టికెటింగ్ వద్ద సమయం వృథా కాకుండా సిబ్బందిని పెంచాలని, అవుటర్ వైపుకు వెళ్లకుండా క్షేత్రం లోపలికి వచ్చే వాహనాలను పూర్తిగా అరికట్టాలని సూచించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న యాత్రికులకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి సేవలందించాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అన్నారు. క్షేత్ర పరిధిలో పర్యటిస్తూ భక్తులతో నేరుగా సంప్రదించారు. అదే విధంగా అన్నదాన భవనంలో వండుతున్న వంటకాలలో తాజా కూరగాయలనే ఉపయోగించాలని సూచించారు. కైలాస ద్వారం, దేవస్థాన వైద్యశాల, క్యూలైన్లు, సీసీ కంట్రోలు రూమ్లను పరిశీలించారు. భక్తులకు మంచినీరు, అల్పాహరం, వైద్యసేవల్లో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సిబ్బందిని సూచించారు.