Maha shivaratri | మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉంది.. శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైల జ్యోతిర్లింగమూర్తికి మూడు తరాలుగా చేపడుతోన్న అద్వితీయ సేవనే ఈ పాగాలంకరణ. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవకాలాన జరిగే పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది.
శ్రీగిరి పర్వతాన స్వయంభువై వెలిసిన మల్లికార్జునుడు శ్రీలింగచక్రవర్తిగా ప్రస్తుతించబడుతున్నాడు. ఆగమ శాస్త్రాల్లోని రాజోపచారాల్లో ఛత్రం, చామరం, వాహనం, నృత్యం, గీతం, వాద్యం, మకుటం వంటి ఉపచారాలు నిర్వహించడం సహజం. వీటిలో మకుటం అంటే కిరీటం. దీనికి బదులు తలపాగాను సైతం వినియోగిస్తున్నారు. తాత్వికపరంగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో ప్రపంచం నిండి ఉంది. పంచభూతాలకు ప్రతీకగా స్వామివారి గర్భాలయ విమాన గోపురానికి మధ్యలో ఉన్న ప్రధాన కలశంతో పాటు నలుమూలలా ఉన్న నాలుగు కలశాలు అని చెప్పవచ్చు. అలాగే వృషభం ధార్మికతకు ప్రతీక అయితే గర్భాలయ ముఖమండంపై ఉన్న నవ నందులు, ఐదు కలశాలకు కలిపి పాగా చుట్టబడుతుంది. 14 లోకాల్లో మల్లన్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించే సేవ ఇది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు అనే భక్తుడి కుటుంబం మూడు తరాలుగా శ్రీశైల మల్లన్నకు పాగాను అలంకరిస్తున్నది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణానికి ముందు పెండ్లి కుమారుడికి తలపాగా చుట్టే ఆచారశైలిని అనుసరించి పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం తరతరాలుగా పాగాలంకరణ సేవ చేస్తున్నారు. ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని నేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన చిమ్మ చీకట్లో దిగంబరులై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, ముఖమండవ నవనందులను కలుపుతూ పాగాలను అలంకరిస్తారు. మహాశివరాత్రి రోజున మల్లన్న స్వామికి నిర్వహించే పాగాలంకరణను దర్శించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి.. ఆ ఏడాదంతా శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే శ్రీశైలం క్షేత్రానికి వచ్చి అశేష భక్తజనం ఈ ఘట్టాన్ని తలకిస్తారు.