పరమ శివుడు జ్యోతిర్లింగ రూపంలో విశ్వానికి దర్శనమిచ్చిన పర్వదినం మహా శివరాత్రి. ఆ రోజు అర్చన అభిషేకాలతోపాటు ఉపవాసం, జాగరణ పాటించే ఆచారం ఉన్నది. శివరాత్రి నాడు పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించి ఎక్కువ సమయం పరమేశ్వర చింతనలో గడపాలని పెద్దల అభిప్రాయం. అందుకు అనువుగా ఉపవాసం, జాగరణ పాటించే విధానం అమల్లోకి వచ్చింది. శరీర ధర్మానికి హాని తలెత్తకుండా వీటిని పాటించాలనీ, అవసరమైన సడలింపులు చేసుకోవచ్చనీ పెద్దలు స్పష్టంగా చెప్పారు. ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండటం. కేవలం భోజనం మానటం మాత్రమే కాదు.
అలాగే జాగరణం అంటే దైవ భావన మన హృదయంలో మేల్కొనడం. కేవలం నిద్ర మానటం కాదు. నిరంతర దైవ చింతన వల్ల మనసు భగవత్ తత్వానికి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది. ‘నేనంటే శరీరం కాదని, ఈ శరీరం దేవుడికి ఆలయమ’నే దివ్యభావన మేల్కొనడమే నిజమైన భక్తి. ఈ భక్తిపథంలో ముందుకుసాగడానికి ఉపవాసం, జాగరణలు దోహదం చేస్తాయి.