అవును.. అన్ని విద్యలూ ఆయనే! సకల జీవుల్లోనూ ఆయనే! ఈశా యోగ కేంద్రంలోనూ అణువణువూ శివతత్వం గోచరిస్తుంది. చుట్టూ పచ్చదనం. మధ్యలో ఆకాశమెత్తు ఆదియోగి విగ్రహం.. వెల్లియాంగిరి కనుమల్లో వెలిసిన ఆధ్యాత్మిక నెలవు ఈశా యోగకేంద్రం. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈశా ఫౌండేషన్ ప్రధాన కేంద్రాన్ని అక్షర సాక్షిగా దర్శించుకుందాం.
జ్ఞాన, కర్మ, క్రియ, భక్తి మార్గాల సంగమ క్షేత్రం.. ఈశా యోగ కేంద్రం. స్వీయ పరివర్తన శాలగా, అంతర్గత పురోగతికి ఆలంబనగా అలరారుతున్న ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రధాన ఆకర్షణ అంబరాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉన్న శంభుదేవుడి ప్రతిరూపం. కైలాస సదనంలో సప్తరుషులకు యోగవిద్యను ఉపదేశించిన ఆదియోగి.. ఇప్పుడు, తమిళనాడు కోయంబత్తూరు సమీపంలో విగ్రహ రూపంలో.. జీవితానికి నిగ్రహాన్ని ప్రసాదించే యోగ విద్యను విశ్వవ్యాప్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. 112 అడుగుల ఆదియోగి మూర్తి పర్యాటక ఆకర్షణగానూ ప్రత్యేకతను సంతరించుకున్నది.
పదిహేను వేల సంవత్సరాల కిందట ఆదియోగి సప్తర్షులకు యోగశాస్ర్తాన్ని బోధించాడు. మనిషి తన పరిమితులను దాటి అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి 112 మార్గాలను ఉపదేశించాడు. ఆ మార్గాలకు ప్రతీకగా ఈశా ఫౌండేషన్లో 112 అడుగుల ఆదియోగి మూర్తిని ప్రతిష్ఠించారు. 2017 మహాశివరాత్రి సందర్భంగా దీనిని జాతికి అంకితమిచ్చారు.
ధ్యానలింగం
జ్ఞానోదయానికి, ఆధ్యాత్మిక వికాసానికి ద్వారం ధ్యానలింగం. 1999లో సద్గురువు ప్రతిష్ఠించిన ఈ ధ్యానలింగాన్ని దర్శించిన భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు. ఇందులోని శక్తి.. తన పరిధిలోకి వచ్చిన వ్యక్తికి జీవితానుభూతిని సంపూర్ణంగా పొందే అవకాశాన్ని కలిగిస్తుందని చెబుతారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాదరస లింగం. నిర్మాణ పరంగానూ ధ్యానలింగ నిలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. 76 అడుగుల వ్యాసం, 33 అడుగుల ఎత్తు కలిగిన నిర్మాణం ఓ అద్భుతం. ఇటుక, మట్టితో కట్టిన గోపురంలో ప్రతి అంశమూ దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలయ అంతర పరిక్రమలో ఎడమవైపున యోగసూత్రాల పితామహుడైన పతంజలి విగ్రహం కనిపిస్తుంది. కుడివైపు ధ్యానలింగం స్త్రీ దేవత వనశ్రీ మందిరం ఉంటుంది. దీనిని పతంజలికి ప్రతిరూపంగా భావిస్తారు. ధ్యానలింగానికి ఎదురుగా లోహంతో రూపుదిద్దుకున్న భారీ నందీశ్వరుడి విగ్రహం గంభీరంగా దర్శనమిస్తుంది. ఈశా యోగ కేంద్రంలో రెండు తీర్థకుండాలు కూడా ఉన్నాయి. పురుషుల కోసం సూర్యకుండం, స్త్రీల కోసం చంద్రకుండం సిద్ధం చేశారు.
అక్షయ వితరణ
మనిషికి సనాతన జీవన విధానం నేర్పే ఈశా కేంద్రంలో పూర్తిగా శాకాహార ఆహారం అందిస్తారు. ప్రతిరోజూ సుమారు 12వేల మంది సమతుల పోషకాహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. వచ్చిన వారికి లేదనకుండా ప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది. మహాశివరాత్రి వంటి ప్రత్యేక పర్వదినాల్లో లక్షమంది వస్తుంటారు. వారందరికీ సుమారు 85 రకాల వంటకాలతో శుచికరమైన ప్రసాదం అందుబాటులో ఉంటుంది. వందల మంది వలంటీర్లు అహర్నిశలూ శ్రమిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులతోపాటు సమీపంలోని ఆరేడు గ్రామాల ప్రజలకూ ఆహారం అందిస్తున్నది ఈశా ఫౌండేషన్. గర్భిణుల కోసం ప్రత్యేకంగా పదార్థాలు సిద్ధం చేస్తుండటం విశేషం.
కళల పాఠశాల
వెల్లియాంగిరి పర్వతాల దిగువన ప్రశాంత వాతావరణంలో నెలకొల్పిన ‘ఈశా హోమ్ స్కూల్’ రేపటి పౌరులను సమున్నత లక్ష్య సాధకులుగా తీర్చిదిద్దుతున్నది. విద్యార్థులకు ఉమ్మడి కుటుంబంలో ఉన్న భావన కల్పిస్తూ.. విలువలతో కూడిన విద్యను అందిస్తున్నది. 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన పాఠశాలలో విద్యాభ్యాసం స్వేచ్ఛగా జరుగుతుంది. జీవన నైపుణ్యాలను అందించడంపై దృష్టి సారిస్తూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలను పాటిస్తున్నది. ఆధునిక విద్యతోపాటు ఈశా సంస్కృతిని విద్యార్థులకు బోధించడం ఇక్కడి ప్రత్యేకత. యోగాతోపాటు శాస్త్రీయ నృత్యం, సంగీతం, భారతీయ కళలు, యుద్ధ కళల అపూర్వ సమ్మేళనంగా ఇక్కడ విద్యాభ్యాసం కొనసాగుతుంది. సంస్కృత భాష, ఆధ్యాత్మిక విలువలు విద్యార్థుల అభ్యసన ప్రక్రియలో ప్రధానంగా ఉంటాయి.
వైభవంగా మహాశివరాత్రి
యావత్ భారతం ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడే పర్వదినం మహాశివరాత్రి. ఆసేతు హిమాచలం శివనామ స్మరణతో మార్మోగుతుంది. ఈశా యోగ కేంద్రంలోనూ మహాశివరాత్రి ప్రత్యేకంగా జరుగుతుంది. సంవత్సరంలో అత్యంత చీకటి రాత్రిగా సద్గురు దీనిని అభివర్ణిస్తారు. యోగ సంప్రదాయానికి మూలమైన ఆదియోగి శివుడి అనుగ్రహం పొందే రోజు ఇదని భావిస్తారు. శివరాత్రి ఏర్పడే గ్రహస్థితుల కారణంగా.. మానవ శరీర వ్యవస్థలో శక్తి ఊర్ధ్వముఖంగా కదులుతుంది. ఈ నాటి రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి, జాగరణ చేయడం మన భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఎంతగానో తోడ్పడుతుంది. మహాశివరాత్రి దివ్యత్వాన్ని అనుభూతి చెందడానికి, ఈశా యోగ కేంద్రంలో రాత్రంతా వేడుకలు జరుగుతాయి. సద్గురు ఆధ్వర్యంలో ధ్యానం కొనసాగుతుంది. ఆధ్యాత్మిక శక్తిని పురిగొల్పడానికి వీలుగా రాత్రంతా సంగీత కచేరీలు ఉంటాయి. శివరాత్రికి మూడు రోజుల ముందునుంచే ‘యక్ష’ కార్యక్రమం మొదలవుతుంది. ఇందులో ప్రసిద్ధి పొందిన కళాకారులతో సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తారు. ఈసారి కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శివ కథలు వింటూ, శివతాండవాలు చూస్తూ, డమరుక నాదాన్ని ఆస్వాదిస్తూ.. మనల్ని మనం ఓ శివుడిగా భావిస్తూ, ఎదుటి మనిషిలోనూ, అనంత సృష్టిలోనూ శివాంశను దర్శిస్తూ.. ఆనందో త్సాహాల మధ్య శివరాత్రి కార్యక్రమాల్లో పాలుపంచుకుందాం పదండి.
యోగేశ్వర లింగం
ఆదియోగి ముఖాకృతి చెంతనే ప్రతిష్ఠించిన యోగేశ్వర లింగం మానవ శరీర వ్యవస్థలోని ఐదు ప్రధాన చక్రాల అభివ్యక్తీకరణగా దర్శనమిస్తుంది. ఈ యోగేశ్వర లింగానికి సమీపంలో సప్తరుషుల మూర్తులు కనిపిస్తాయి. ఇక్కడ యోగేశ్వర లింగంతోపాటు సప్తరుషులకూ దివ్య హారతి ఘనంగా జరుగుతుంది. హారతి అనేది ఆదియోగి స్వయంగా సప్తరుషులకు అందించిన ఒక శక్తిమంతమైన ప్రక్రియగా భావిస్తారు. ఈ సంప్రదాయానికి కొనసాగింపుగా నేటికీ ఏడాదికి ఒకసారి కాశీవిశ్వనాథుడి అర్చకస్వాముల వంశానికి చెందిన పూజారులు స్వయంగా వచ్చి ఈ క్రతువును నిర్వహిస్తుండటం విశేషం. అంతేకాదు, కాశీ విశ్వనాథుడి సన్నిధి తర్వాత సప్తరుషి హారతి నిర్వహిస్తున్న ఏకైక క్షేత్రం ఈశా యోగ కేంద్రమే!
లింగ భైరవి
ఈశా యోగ కేంద్రంలో మరో విశేషం ‘లింగ భైరవి’. ఈ దేవత అనుగ్రహం పొందితే జీవితంలో పేదరికం, వైఫల్యాలు, మరణం గురించి చింతించాల్సిన అవసరం లేదని చెబుతారు సద్గురు. అమ్మ కరుణతో మనిషి శ్రేయస్సుకు కారణమైనవన్నీ సొంతమవుతాయని నమ్మకం. 2010లో లింగ భైరవిని మాతృదేవత అంతిమ అభివ్యక్తిగా సద్గురు ప్రతిష్ఠించారు. భక్తుడి భౌతిక అంశాలను పొందడానికి, వాటిని అధిగమించడానికి.. ఇలా సకల అవసరాలను ఆమె అంతిమ ప్రదాతగా అనుగ్రహిస్తూ ఉంటుంది. లింగ భైరవి మానవ శరీర వ్యవస్థలోని మూడు ప్రాథమిక చక్రాలను బలపరుస్తుంది. తద్వారా శరీరం, మనసు, శక్తి స్థిరపడతాయి.