Lord Krishna | గోపికలు యశోదతో… ఓ ఇందు వదనా!
మీకు సంపద ఎక్కువగా ఉంటే మిక్కిలి మక్కువతో ఇంపైన విందు భోజనాలు కుడువ- ఆరగించవచ్చు. మేలైన పుట్టములు- పట్టు పీతాంబరాలు కట్టుకోవచ్చు. అంతేకాని, సుంతైనా దయ లేకుండా మీ సంతానాన్ని మా వంటి బడుగుల- పేదల ఇళ్లపైకి వదలి పెట్టడం, మేము ఇడుములు- బాధలు పడుతూ ఉంటే కళ్లప్పగించి చూస్తూ నవ్వి ఊరుకోవడం- ఇది ఏమి మంచి పద్ధతి తల్లీ!
కం॥ ‘ఓ యమ్మ! నీ కుమారుడు
మా యిండ్లను బాలుఁ బెరుఁగు మననీడమ్మా
పోయెద మెక్కడికైనను
మా యన్నల సురభులాన మంజులవాణీ!’
ఓ నందరాణీ! చూడమ్మా, నీ బాలుడు మా ఇళ్లలో పాలు, పెరుగు బతకనివ్వడం లేదు. మా అన్నగారు నంద ప్రభువుల వారి ఆలమంద మీద ఒట్టు. ఓ మంజులవాణీ!- నీ వాక్చాతుర్యంతో- మెత్తని మాటలతో సర్దిపుచ్చాలని చూస్తావేమో! ఇక ఈ వాడలో మేము చస్తే ఉండలేం. ఈ ఊరు విడిచి మరో చోటికి వెళ్లాల్సిందే.
శుకుడు- పరీక్షిన్మహారాజా! ‘నీ చిన్నవాడు మాయ నేర్చి.. కాని పనులు ఎన్నో చేయ పూనుచున్నాడ’ని గొల్ల పడుచులు గొల్లుమనగా, వారి మాటలన్నీ విన్న యశోద ఇలా అన్నది…
కం॥ ‘చన్ను విడిచి చనఁడిట్టటు
నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెరుఁగడు నేఁడుం
గన్నులు దెరవని మా యీ
చిన్ని కుమారుని రవ్వసేయందగునే?’
వనితలారా! నా చిరుత- చిన్నవాడు నా ఒళ్లో కూర్చుని చన్నుపాలు తాగడం తప్ప నన్ను విడిచి ఎన్నడూ పక్కకైనా పోడు. మా కన్నయ్యకు ఇంకా పొరుగిళ్లు, తోవలు తెలియవే. ఈ నాటికీ కళ్లు కూడా సరిగా తెరవని పసివానిని పట్టుకొని ఇలా ఆరళ్లు (నిందలు) వేయడం మీకు తగునా?
తే॥ ‘అన్యమెరుఁగడు, తన యంత నాడు చుండు
మంచివాడీతఁడెగ్గులు మానరమ్మ!
రామలార! త్రిలోకాభిరామలార!
తల్లులార! గుణవతీమ తల్లులార!’
‘మా తనయునికి తాను తప్ప ఇతరమేమీ తెలియదు. ఏదో తనంత తాను ఆడుతూ తనలో తాను ఆనందిస్తూంటాడు. మావాడు ఎంతో బుద్ధిమంతుడు. అమ్మలారా! ముద్దుగుమ్మలారా! మీరందరూ సద్గుణవతులు. మూడు లోకాలలోనూ కడు అందగత్తెలు. ఇకనైనా మా కృష్ణచంద్రునిపై నిందలు మోపడం మాని మీ మీ మంద- వాడలకు మరలిపొండి. సతీమ తల్లులారా! మిమ్మల్ని బతిమాలుకుంటున్నా’.
శుకుడు- రాజా! యశోద గోపికలను సముదాయించి పంపిందే కాని, కొడుకును మాత్రం కోపించి మందలించలేకపోయింది. అండజయానలు- వ్రేతలు ఇకపై కూడా కొండెములు చెప్పకుండా ఉండలేకపోయారట! ఎందుకని? కామ జనకుడైన ఆ రామానుజుని వామ- సుందర రూపాన్ని ఆ గొల్లభామలు వీక్షించకుండా ఉండలేరు కనుక! వాస్తవానికి ఎవరా వనితలు? ‘గోప్యస్తు సురస్త్రియః, శ్రుతయో జ్ఞేయాః’- విబుధ వధువులు- దేవతాస్త్రీలు. శ్రుతులు- వేదమంత్ర స్వరూపిణులు. అందుకే ఈ ఇందు ముఖలందరూ ఏదో ఒక మిష- నెపంతో నందగృహానికి వచ్చి విషధరరిపు గమనుని- గరుడ వాహనుని, ఆ బాలముకుందుని తిలకించి మోహితులై పులకించిపోయేవారు.
ఇద్ధ (ప్రవిత) చరితుడు, సిద్ధపురుషుడూ అయిన పోతన పై తేటగీతిలో ‘గీత’లోని ‘మత్తః పరతరం న అన్యత్ కించిత్ అస్తి ధనంజయ’- అన్న శ్లోక తాత్పర్యాన్ని- ఉపనిషత్తుల పరమార్థమైన పరబ్రహ్మ స్వభావాన్ని నందగోపుని ఇల్లాలి ముఖతః అందంగా తేటతెల్లం చేశాడు. ‘అన్య మెరుఁగడు’… సర్వం ఖల్విదం బ్రహ్మ, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ (ఉపనిషత్తు), ‘సర్వము తానయైన వాడు’ (గజేంద్రస్తుతి)- అంతా తానే కాన తన కన్నా ఇతరమైనది ఏదీ లేదని తెలిసినవాడు. ద్రష్ట- చూసేవాడు, దృశ్యం- చూడబడేది.. రెండూ తానే అయినవాడు. ‘తనయంత నాడు చుండు’.. ‘ఆనందో బ్రహ్మ’ (ఉపనిషత్తు) తాను ఆనంద స్వరూపుడు కాన, ఆత్మరతిః ఆత్మక్రీడః’ (ఉపనిషత్తు).. తనతో తానే ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు! స్థూల భక్తి కన్నా సూక్ష్మ మానసిక భక్తి (పరాపూజ) నూరు రెట్లు మిన్న అన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి- తన భక్తులైన గోప గోపాంగనలకు ‘వెన్నదొంగ’ ఎప్పుడు ఎలా వస్తాడో కదా!- అన్న స్మరణ (సర్వేషు కాలేషు మాం అనుస్మర- గీత) తైలధార వలె ఎడతెగక కొనసాగునట్లు వారికి ధ్యాన పూర్వక మానసిక భక్తిని అనుగ్రహించాడు కన్నయ్య.
క్షీరం (పాలు) సత్త గుణానికి, క్షీరసారం (వెన్న) జ్ఞానానికి ప్రతీకలు. పాలు వెన్నలు దేహానికి పుష్టి, తుష్టి కలిగించునట్లు జ్ఞానం ముముక్షు సాధకులకు ఆధ్యాత్మిక దృష్టిని ప్రసాదిస్తుంది. దృష్టిని జ్ఞానమయంగా చేసుకొని సృష్టిని బ్రహ్మమయంగా చూడమని శాస్త్ర ఆదేశం. ‘సారగ్రాహీ జనార్దనః’- భగవంతుడు సారాన్ని స్వీకరించే శీలం- స్వభావం కలవాడు. ‘శుభాంగో లోక సారంగః’ అని విష్ణువుకు నామాలు. పాలసారం వెన్న. బాలకృష్ణుడు నవనీత ప్రియుడు. వెన్నను దొంగిలించైనా తింటాడు. చిన్నది కాని, పెద్దది కాని- ఏ కర్మ చేసినా, ఆ కర్మను చూడక దాని సారం గ్రహిస్తాడు. గోపికలు ఎంత ప్రేమతో వెన్న తినిపిస్తారో, ఆ ప్రేమ కావాలి పరమాత్మకి. కంసారి (కృష్ణుని) చరణకమల సంస్మరణమే సంసారంలోని సారం! భవసారం స్వీకరించి అనుభవించడమే సూరి- పండిత లక్షణం.
క్షీరసారాన్ని- వెన్నను ఆస్వాదించిన- అనుభవించిన పిమ్మట భాండమును (పాత్రను) పక్కన పెట్టినట్లు, మోక్ష కాముకులకు ఉండకూడని దేహభ్రాంతి (దేహమే నేను అను భ్రమ)ని తొలగించడానికి, ఆత్మానుభూతి పొందిన పిమ్మట డిందు- నశించు స్వభావం కల భాండం (కుండ) వంటి బొంది (దేహం) పట్ల క్షర- నశ్వర (నశించిపోయేదన్న) దృష్టి కలిగి ఉండాలని బోధించడానికి సంకేతంగా అఖండ బ్రహ్మాండాధిపతి భాండాలను బద్దలు చేసేవాడని ‘భాండభేదన’ లీలకు పరమార్థం! ఈ అవగాహన లేని అజ్ఞానులే అచ్యుతునిపై అభాండాలు వేస్తారు.
దశమ స్కంధం కృష్ణకథలో అధిక ఆక్షేపణకు, అపార్థానికి లోనైన ఘట్టాలు మూడు- నవనీత చౌర్యం, గోపీ వస్ర్తాపహరణ, రాసలీల. ధర్మ స్వరూపుడు, ధర్మ కర్త, భర్త అయిన దేవదేవుడు దొంగతనం చేయడమేమిటి? అని అధిక్షేపించే వారి ఆశంక. జగత్తే రూపంగా కలిగిన జగన్నాథుడు భగవంతుడు చోరుడా? ఎంత అసంగతం, అనుచితం? ఎంత అజ్ఞాన విలసితమైన, ప్రజ్ఞా శూన్యమైన వింత ప్రలాపం! ఈ విశ్వంలో ‘అంతర్బహిః’- లోపల, బయట ఆయన సొంతం కాని వస్తువు- కాదు కాదు, ఆయన కాని వస్తువు ఇసుమంతైనా ఉన్నదా? ‘హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. హరి మయము కాని ద్రవ్యము పరమాణువు లేదు’- (భాగవతం). పరమాత్మ దేనిని దొంగిలించాలి? తన స్వరూపాన్ని తానే తస్కరించడమా? అది సంభవమా? ‘స ఏవ సృజ్యః స చ సర్గకర్తా’- (విష్ణు పురాణం). సృష్టీ తానే, స్రష్టా తానే. ‘భ్రాజిష్ణుర్భోజనం భోక్తా’- భోజనం (అన్నం) తానే, భోక్తా (అన్నాదుడు) తానే! పరమాత్మ సృష్టించిన వస్తువులను తమవిగా భావించి, భగవత్సంపదను బలవంతంగా అపహరించి, ఆయన సంతతిని- వివిధ ప్రాణి వర్గాలను సంపద వంచితులుగా చేసేవారు తస్కరులు.
ఆ ముష్కరు (కపటు)లే కదా శిక్షార్హులు? కన్నయ్య పాలు, పెరుగు, వెన్న దొంగిలించినా తను తిన్నది తక్కువ. పాడిపంటల భాగ్యానికి నోచుకోని కడు పేదబాలలకు తినిపించింది ఎక్కువ. రామావతారంలో సహకరించిన మర్కటాలకు కృతజ్ఞతగా పంచి పెట్టిందీ ఎక్కువే. నిజానికి మంద- గోకులంలో ఎవరి ఇంట్లో పాలు పెరుగు లేకపోయినా వాటిని నంద ప్రభువు గృహం నుండే ఉచితంగా పొందుతూ ఉండేవారు. శ్రుతు (వేదా)లే పరమాత్ముని ‘తస్కరపతి’గా నుతించాయి. ఎందువల్లనైనా ‘వెన్నదొంగ’ రాకపోతే ఇందువదనలు- గొల్ల వనితలు తల్లడిల్లిపోయేవారు. ఆ పల్లెటూరి పడుచులు, ఆ గొల్లభామలు నల్లవానిని చోరునిగా స్మరించినా శ్రేయస్సు- మోక్షం పొందారు. కాన, ఎలా చూచినా నవనీత గ్రహణం చౌర్యం కాదు.
బాలకృష్ణుడు గోపబాలల వెన్నలాంటి మానసాలు హరించిన ‘చిత్తచోరుడు’! ఇంతాచేసి అప్పటికి కృష్ణునికి రెండు-మూడు ఏళ్లు! ‘తనది కాని వస్తువును తనదని భావించి, దానిని స్వాధీనపరుచుకొని అనుభవించువాడు చోరుడు. పారమార్థికంగా… ‘తాను నిత్యశుద్ధ బుద్ధ ముక్త సచ్చిదానంద స్వరూపుడు. తాను చైతన్యమే కాని జడము కాదు. తానుకాని దేహ, ఇంద్రియ, మనోబుద్ధులను తానని భ్రమించు అజ్ఞాని నిషిద్ధ కర్మలు చేసే చోర సమానుడు. ‘నేను’ అంటే ఎవరు? శుద్ధ చైతన్యమే ‘నేను’. చైతన్యమైన ఆత్మదేవుడవు నీవు కానప్పుడు నీవే దొంగవు! నువ్వు చేసేదంతా చౌర్యమే! నువ్వు తినేదంతా పరులసొమ్మే!’ అని శంకర భగవత్పాదులు ఆధ్యాత్మిక చౌర్యాన్ని వివరించారు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006