‘కృష్ణుడు’అంటేనే సర్వానందం. సమస్త జీవుల శ్రేయస్సు కోసం జన్మించిన ఆ అవతారమూర్తి ఆవిర్భావాన్ని లోకమంతా ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుపుకొంటుంది.
హరేకృష్ణ ఉద్యమాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేసి, ఆ నల్లనయ్యను ప్రజలకు దగ్గర చేసినవారు శ్రీల ప్రభుపాద. వారి నిర్విరామ కృషి ఫలితమే నేడు ప్రపంచంలో ‘హరే కృష్ణ’ మంత్రం ఇంటిల్లిపాదికీ చేరువైంది. ‘శ్రీకృష్ణుడు అందరికీ పరమపిత, వారి అవతరణ మహోత్సవాన్ని జరుపుకోవడానికి అందరూ అర్హులేన’ని శ్రీల ప్రభుపాదులవారు వివరించారు. శ్రీకృష్ణుడు ఈ లోకంలో తన లీలలను ముగించి అవతార సమాప్తి గావించగానే కలియుగం ప్రారంభమైందని భాగవతం వివరిస్తున్నది. అయితే, తన భక్తులు తనను నిరంతరం సేవించడానికి, తద్వారా తన ఆశీస్సులను అందించేందుకు శ్రీకృష్ణుడు అర్చామూర్తిగా వెలిశాడు.
దేవాలయాల్లో మనం దర్శించే కన్నయ్య మూర్తికి, సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మకు మధ్య ఎలాంటి భేదమూ లేదు. అయితే, నిత్యం జగద్గురువు సాంగత్యంలోనే తరించాలని భావించే భక్తులకు మాత్రం కేవలం దేవాలయాల్లోనే ఆయన సాంగత్యం లభించడం అంతగా తృప్తినివ్వదు! ధర్మం క్షీణించినప్పుడల్లా తాను ఈ లోకంలో అవతరిస్తానని భగవద్గీతలో చెప్పిన పరమాత్మ, లోకంలో నెలకొంటున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఎక్కడున్నాడని మరికొందరు ప్రశ్నించవచ్చు. తాను వాగ్దానం చేసినట్టుగానే ఈ లోకంలో అవతరించాడు.
‘కలికాలే నామ రూపే కృష్ణావతార’- కలియుగంలో శ్రీకృష్ణుడు హరినామ రూపంలో అవతరించాడు. హరినామాన్ని జపించిన ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడి ప్రత్యక్ష సన్నిధానంలో ఉన్నట్టే. పవిత్రమైన జన్మాష్టమి సందర్భంగా ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ మహామంత్రాన్ని మనసారా జపించి తరించండి. నిత్యం అనుష్ఠించి శ్రీకృష్ణ అనుగ్రహాన్ని పొందండి.
…? శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి, 93969 56984