భక్తి గీతాలు మార్మోగగా.. భజన పాటలు పల్లవిస్తాయి. తాళాల దరువులు, మద్దెల మోతల మధ్య.. కోర మీసాల స్వామికి మొక్కులు చెల్లిస్తారు. బారులు తీరిన ప్రభ బండ్ల మీద భక్తులు కొత్తకొండకు తరలివస్తారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలువుదీరిన వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారం. రుద్రాంశ సంభూతుడైన స్వామిని కొలిస్తే కోరింది నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వీరభద్రుడి సన్నిధిలో మూడు రోజులపాటు జాతర ఘనంగా జరుగుతుంది. ‘కొత్తకొండ స్వామికి శరభ.. వీరభద్రస్వామికి శరభ’ అన్న నినాదాలు ఆలయ పరిసరాల్లో మార్మోగుతాయి. ఆలయానికి వెళ్లే దారులన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. భోగి ముందురోజు రాత్రి నుంచే అందంగా ముస్తాబుచేసిన ప్రభ బండ్లు కొత్తకొండకు దారితీస్తాయి. భోగినాడు వీరబోనం సమర్పించేందుకు ఉత్సాహంగా కదలివెళ్తారు. కనుమ నాడు సాయంత్రానికి ప్రభ బండ్లు తిరుగుముఖం పడతాయి. ఐదు శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. శాలివాహన కులానికి చెందిన దామెరుప్పుల వంశస్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రభ బండ్లను తిప్పుతూ, ప్రత్యేక పూజలు చేయడం ఇక్కడ ఆచారం. పిల్లల భవిష్యత్తు, చదువు, ఉద్యోగం, పెండ్లి, కొత్తఇల్లు.. ఇలా వివిధ కోరికలు నెరవేరితే బండి కడతామని భక్తులు మొక్కుకుంటారు. భక్తులు వీరభద్రుడిని తమ ఇంటి మనిషిగా భావిస్తారు. తమ పిల్లలకు కొత్తకొండయ్య, వీరభద్రం అనే పేర్లను పెట్టుకుంటారు. బండ్లు కట్టేవాళ్లతోపాటు వేలాదిగా సాధారణ భక్తులు వీరభద్రుడి దర్శనానికి వస్తుంటారు. స్వామివారికి వెండి కోరమీసాలు సమర్పిస్తుంటారు.
– నూటెంకి సతీశ్, 93928 28111