బాలాజీ జిల్లా : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమంజనం తర్వాత స్వామివారి మూలవిరాట్లుకు ఆగమోక్తంగా పూజాదికాలు చేపట్టారు. ఏడాదిలో నాలుగు పర్వదినాలైన ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారం రోజున ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేపట్టారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
తిరుమంజనం చేపట్టిన తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చిన మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మారుతి ప్రసాద్, సనత్ కుమార్, మధుసూదన్ యాదవ్, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, వీజీఓ బాలిరెడ్డి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.