తిరుమల : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం చేపట్టారు. తిరుపతి జేఏవో వీరబ్రహ్మం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్కు చెందిన శ్రీధర్-లక్ష్మీ దంపతులు ఆలయానికి 21 పరదాలను విరాళంగా అందించారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.