తిరుపతి : తిరుపతి(Tirupati) కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తామతని టీటీడీ(TTD) అర్చకులు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఉదయం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు తీసుకువచ్చి, స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.
సాయంత్రం సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో స్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, కంకణభట్టార్ సీతారామాచార్యులు, సూపరింటెండెంట్ సోమ శేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్ పాల్గొన్నారు.