TTD news | శ్రీనివాసమంగపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్సేవ వైభవంగా చేపట్టారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, కంకణభట్టార్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామి సోమ స్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థ సారధి, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణతోపాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.