ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణం జగన్నాథుడి దివ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే ‘రథయాత్ర’ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇందులో జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలు కూడా పాల్గొంటాయి. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి తరలివెళ్తాయి. ఈసారి జూన్ 27న జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది.
పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.
జగన్నాథ దేవాలయం ఉత్తర భారత ఆలయ సంప్రదాయమైన నాగరశైలిలో ఉంటుంది. ఆలయాన్ని మొదట ఇంద్రద్యుమ్నుడనే రాజు నిర్మించాడని చెబుతారు. ఇప్పుడున్న భారీ ఆలయాన్ని 11-12 శతాబ్దాల్లో కళింగ (ఒడిశా) ప్రాంతాన్ని పరిపాలించిన అనంతవర్మ చోడగాంగ అనే రాజు నిర్మించాడు. గర్భాలయంలో కొలువైన అసంపూర్తిగా ఉన్న దారు (కొయ్య) విగ్రహాలకు సాక్షాత్తూ దేవశిల్పి విశ్వకర్మనే రూపమిచ్చాడని అంటారు.
గుండిచా మందిరం నుంచి రథాల తిరుగు ప్రయాణాన్ని ‘బాహుదా ఉత్సవం’ అని పిలుస్తారు. ఈ వేడుక మర్నాడు మూడు మూర్తులకు బంగారు ఆభరణాలు అలంకరిస్తారు. దీన్ని ‘సునా బేష’ అని వ్యవహరిస్తారు. ఇక ముగ్గురూ ప్రధాన ఆలయంలో తిరిగి ప్రవేశించడాన్ని ‘నీలాద్రి బిజే’ అని పేర్కొంటారు. రథయాత్రలో ఇదే చివరి వేడుక.
జుగర్నాట్: విధ్వంసకరంగా, దయలేకుండా, ఆపడానికి వీలులేనిదిగా సాగిపోయే శక్తిని ఇంగ్లిష్లో ‘జుగర్నాట్’ అంటారు. ఈ పదానికి మూలం జగన్నాథుడి రథమే.
మూడు రథాలు: జగన్నాథ రథయాత్రలో మొత్తం మూడు రథాలు పాల్గొంటాయి.
నందిఘోష: జగన్నాథుడి రథం పేరు నందిఘోష. ఇది 16 చక్రాలతో 46 అడుగుల ఎత్తు ఉంటుంది. మూడు రథాల్లో ఇదే ఎత్తయినది.
తాళధ్వజ: ఇది కృష్ణుడి అన్న బలరాముడు (బలభద్రుడి) రథం పేరు. 45 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో, 14 చక్రాలతో అలరారుతుంది.
దేవదళన: బలరామకృష్ణుల చెల్లి సుభద్ర ఊరేగే రథమే దేవదళన. 42 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో, 12 చక్రాలను కలిగి ఉంటుంది ఈ రథం.