Laxmi narasimha swamy | లక్ష్మీదేవితో కూడిన మహావిష్ణువు పరిపూర్ణ అవతారం.. నరసింహస్వామి. నిజానికి అంతటా వ్యాప్తమై ఉండేదే విష్ణుతత్త్వం. మాయకు ప్రతీక అయిన హిరణ్యకశిపుడు పగలూరేయి, ఇంటా బయట మరణం వద్దని కోరుకున్నాడు. ఇవి ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలను పరిహరించి హిరణ్య కశిపునికి ముక్తిని ప్రసాదించాడు స్వామి. స్తంభం అజ్ఞానానికి ప్రతీక. హిరణ్యకశిపుడు దానిని కూల్చాడు. అంటే అజ్ఞానాన్ని నశింపజేశాడు. ‘అహంకృతి’ అనేది భక్తిగా రూపాంతరం చెందింది. దానితో నరసింహస్వామి దర్శనం అయింది. ద్వంద్వాలను అధిగమించి భగవంతుడిలో లయమయ్యాడు. అదే ప్రహ్లాదుడు మాయ పరిమితులను అవగాహన చేసుకొని.. సచ్చిదానంద స్వరూపుడై, పరబ్రహ్మతో అనుసంధానమై అంతటా వ్యాపించాడు.
ప్రహ్లాదుడు తలచినంతనే ఎన్నోసార్లు ఆపన్నహస్తం అందించాడు విష్ణుమూర్తి. పిలిచిన వెంటనే స్తంభంలో నరసింహుడిగా నిలిచాడు. భక్త ప్రహ్లాదుడే కాదు.. ఆర్తితో ఏ భక్తుడు పిలిచినా ఆదుకుంటాడు నరసింహుడు. ‘మమదేహి కరావలంబం- నాకూ చేయూత ఇవ్వండి’ అని ప్రార్థిస్తే.. అభయ హస్తంతో సాక్షాత్కరిస్తాడు!
శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే!
భోగీంద్ర భోగ మణి రాజిత! పుణ్యమూర్తే!
యోగీశ శాశ్వత శరణ్య! భవాబ్ధి పోత!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబం!!
దేవతలలో గొప్పవాడవైన ఓ లక్ష్మీనరసింహా! పాల సముద్రంలో నివసించేవాడా! సుదర్శన చక్రాన్ని ఆయుధంగా కలిగినవాడా! ఆదిశేషుడి తలమీద ఉండే మణులను ఆభరణాలుగా కలిగినవాడా! మంచివీ పవిత్రమైనవీ అయిన చేతలే మూర్తిగా రూపుదాల్చినవాడా! సాధువులకు శాశ్వత రక్షణగా ఆశ్రయమైన వాడా! సంసార సాగరాన్ని దాటడానికి ఓడగా
నిలిచిన వాడా! దయతో నాకు నీ చేతులను ఊతంగా ఇవ్వు స్వామీ!
జగద్గురువు ఆదిశంకరులు సాధారణ జనాలను ఉద్ధరించే ఉద్దేశంతో ‘శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబం’ స్తోత్రాన్ని అందించారు. ఈ స్తోత్రంలో శంకరులు నరసింహస్వామిని సగుణ నిర్గుణ పరబ్రహ్మంగా వర్ణించడం కనిపిస్తుంది. భక్తి, విశ్వాసాలతో కొలిచే వారిని దయతో రక్షించే స్వామిగా ప్రతీతుడీ దేవుడు. స్వయంగా ఆది శంకరాచార్యుడే ఒకనాడు బావిలో పడ్డాడు. బయటకు మార్గం కనిపించలేదు. స్వామిని ‘మమదేహి కరావలంబం’ అని ప్రార్థించాడు. తాను రక్షణ పొందుతూ, తన ఆపదను అవకాశంగా మలచుకొని లోకానికి ఈ స్తోత్రాన్ని అందించి ఉపకారం చేశాడు.
కరావలంబ స్తోత్రంలో కరుణరసం కనిపిస్తుంది. స్తుతి చేసేటప్పుడు నిరంతరం భగవంతుడిని హృదయంలో దర్శిస్తూ ఆర్తితో విన్నవించుకోవాలి. ‘నాకిది కావాలి’ అని కాకుండా… నీ దరికి చేర్చమని ప్రార్థించాలి. అప్పుడు స్వామి ఆపదలను తొలగించి అర్హత మేరకు అనుగ్రహించి ఆదుకుంటాడు. ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకంలోనూ తాను జీవునిగా భావిస్తూ మాయా ప్రపంచం రూపాలు, దానివల్ల తలెత్తే ప్రమాదాలను వివరించారు. చివరగా ప్రహ్లాదుడు, నారదుడు, అంబరీషుడు, వ్యాసుడు లాంటి భక్తులను రక్షించిన విధంగానే తననూ రక్షించమని మనందరి పక్షాన భగవంతుడిని ప్రార్థించాడు.
‘క్షీరపయోధివాస..’ పాల సముద్రంలో నివసించేవాడా! అని స్తుతించారు శంకరులు. పాలసముద్రంలో సూర్యచంద్రుల కాంతులు ఉండవు. వాయు సంచారమూ ఉండదు. తరంగాలూ ఉండవు. అంటే పాల సముద్రమే మన హృదయమనే గుహ. దానిలో నివసించేవాడు పరమాత్మే. నిశ్చలమైన మనసులో ఆలోచనలు ఉండవు. నిరాలోచనస్థితి విష్ణువు స్థానం. అక్కడ విష్ణువు పాదాల చెంత లక్ష్మీదేవి ఉంటుంది. ఇతర చింతనలు లేకుండా సదా భగవంతుడి చింతనలో గడిపేవాడి దగ్గరికి సంపదలు వద్దన్నా వచ్చిచేరుతాయి. అయితే సంపదలు పాము పడగలాంటివి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. శరణంటూ ఆ యోగీశ్వరుని పంచన చేరితే.. భయంకరమైన మొసళ్లు మొదలైన వాటిని తలపించే కామక్రోధాదులతో నిండిన భవ సాగరాన్ని దాటించే నావగా నరసింహుడు అనుగ్రహిస్తాడు.
సంసారం దావాగ్ని లాంటిది. జీవితమనే అడవిలో సమస్యలనే అగ్ని కీలలను మనమే అంటించుకుంటాం. ఆ మంటలను ఆర్పగల సమర్థుడు ఆ లక్ష్మీ నృసింహుడు. ‘జీవితం వల వంటిది’ అంటాడు ఆదిశంకరులు. ‘వలలో గాలానికి చిక్కుకున్న చేపలా ఉన్నాను. నన్ను కాపాడమని నీ పాదాలను ఆశ్రయించాను’ అని వేడుకుంటాడు. వల అనేది ఇంద్రియాలకు ప్రతీక. అయితే స్వామి పాదాల వద్దనున్న చేపలు సంసారమనే వలకు చిక్కవు.
జీవితం ఒక వృక్షం. జీవి చేసే పాపాలు దానికి బీజం. అనంతంగా చేసే కర్మలు దాని శాఖలు. ఇంద్రియాలు దాని ఆకులు. కామం అనేది పుష్పాలు. ‘స్వామీ అలాంటి చెట్టును ఎక్కి పడిపోతున్నాను నన్ను కాపాడుమ’ని స్వామిని వేడుకోవాలని సూచించాడు శంకరాచార్యులు. దుఃఖానికి దుఃఖానికి మధ్య ఉండేదే సుఖం. అయినా దుఃఖం కూడా శాశ్వతం కాదు. చిత్రగుప్తుడు మన కర్మల ఫలితాన్ని చెబితే, యముడు శిక్ష విధిస్తాడని అంటారు. అంటే చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్రగుప్తుడు. ఉఛ్చ్వాస, నిశ్వాసలే యమభటులు. ‘నా కోరికలే నా భయానికి కారణం. ఏకాకినైన నన్ను ఎవరో లాగివేస్తున్నట్లుగా ఉన్నది. నన్ను కాపాడు!’ అంటూ మనందరి పక్షాన శంకరులు ప్రార్థించాడు.
ఇలా 25 శ్లోకాలతో స్వామిని స్తుతించాడు ఆదిశంకరులు. జగద్గురువు అందించిన ‘లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం’ నిత్యం పారాయణీయం. మానసిక ప్రశాంతతకు పదునైన ఔషధం ఈ స్తోత్రం. ప్రతినిత్యం చదివినా, విన్నా దుష్టగ్రహ బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు తొలగిపోతాయని, ప్రహ్లాద వరదుడు ఆపన్నహస్తంతో ఆదుకుంటాడని ఫలశ్రుతి.
– పాలకుర్తి రామమూర్తి