‘గాలికన్నా వేగమైనది ఏది?’ అన్న యక్ష ప్రశ్నకు ‘మనసు’ అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు. క్షణంలో వెయ్యోవంతు కూడా అది పని లేకుండా ఉండదు. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలాంటి మనసును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు స్వాధీనమైపోతుంది. కామ క్రోధాదులను బలపరుస్తుంది.
ఇంద్రియాలకు వశుడైన మనిషి ఏది చేయాలో, ఏది చేయకూడదో అనే విచక్షణ కోల్పోతాడు. క్షణికమైన సుఖాల కోసం వెంపర్లాడటం మొదలవుతుంది. నాటినుంచి అతని పతనం ప్రారంభం అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెబుతుంటారు పెద్దలు. మనసును ఇంద్రియాల వశం కాకుండా కాపాడుకోవాలి. నిబద్ధత, సత్సాంగత్యంతో దానిని అదుపులో పెట్టుకోవాలి. అదే మనో నిగ్రహం.