తిరుమల : నిత్య అలంకారప్రియుడు తిరుమల (Tirumala ) ఏడు కొండలస్వామికి విశాఖకు చెందిన ఓ పారిశ్రామిక వేత్త భారీ బంగారు కానుకను విరాళంగా అందజేశారు. విశాఖకు చెందిన హిందుస్తాన్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్రావు, కుంకుమ దంపతులు శ్రీవారికి రూ. 3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్ అభినందించి తీర్థప్రసాదాలను అందజేసి అభినందించారు.
తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల వాయిదా
తిరుమల : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో
డిసెంబర్ 29, 30 , 31 వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయడం లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు.
టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తుందని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న స్వామివారిని 63,837 మంది భక్తులు దర్శించుకోగా 20,904 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 2.85 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.