శ్రీశైలం : వేలాది మంది భక్తులతో శ్రీశైల క్షేత్రం ఆదివారం కిటకిటలాడింది. సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివారంతో పాటు అమావాస్య కావడంతో తెల్లవారు జాము నుంచే భక్తులు నదీ స్నానాలు చేసి ఆలయ క్యూలైన్లలో బారులు తీరి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని ఆలయ అ ధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు సామూహిక అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు పూజల్లో పాల్గొన్నారు.
సుమారు 30వేల మంది వరకు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. క్షేత్రానికి వచ్చే భక్తులకు బస చేసేందుకు వసతి గదులు ఆన్లైన్తో పాటు దేవస్థాన కౌంటర్ల వద్ద సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా దళారులు భక్తుల నుంచి రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపించారు. క్యూలైన్లలో బారులు తీరినా ఆర్జిత సేవా టికెట్లు దొరకడం లేదని పేర్కొన్నారు. ఆలయ ఉన్నతాధికారులు చొరవ చూపి సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.