Yadadri Laxmi narasimha Swamy | నరసింహుడి అవతారం ఓ అద్భుతం. పద్నాలుగు భువనాలు ప్రకంపించిన సన్నివేశం. భక్తుడి మాటను మరుక్షణంలో నెరవేర్చిన సందర్భం. ఈ అపురూపమూర్తి అవతార ఘట్టాన్ని అత్యద్భుతంగా అభివర్ణించాడు పోతన అమాత్యుడు. ప్రహ్లాదుడు దర్శించిన నరకేసరిని.. ముమ్మూర్తులా అలాగే మనకు సాక్షాత్కరింపజేశాడు. నరసింహస్వామి ఉద్భవించిన తీరును ఉత్కంఠ కలిగించే రీతిలో ఆవిష్కరించాడు. స్వామి భీకర రూపాన్ని నఖశిఖ పర్యంతం ప్రస్తుతించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన విధానాన్ని కళ్లకుకట్టాడు. పోతన అభివర్ణించిన నరసింహమూర్తిని మీరూ దర్శించుకోండి..
‘నీ హరి ఎక్కడ?’ అని ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు. ‘అణువణువునా ఉన్నాడు. ఎక్కడ వెదికితే అక్కడ లభిస్తాడు’ అన్నాడు ప్రహ్లాదుడు. ‘ఈ స్తంభంలో చూపగలవా?’ గద్దించాడు హరివైరి. ‘అందులో సందేహమే లేదు’ అన్నాడు ప్రహ్లాదుడు. క్రోధావేశంలో ఖడ్గాన్ని ఝళిపిస్తూ, స్తంభాన్ని అరచేతితో ఒక్క దెబ్బకొట్టాడు రాక్షసరాజు. ఆ దెబ్బకు పది దిక్కుల నుంచి అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. స్తంభం ఛిన్నాభిన్నమైంది. అందులోంచి ఓ దివ్య తేజస్సు.. ఓ అద్భుత ప్రకాశం.. ఆవిర్భవించింది.
పరమాద్భుత రూపంలో నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ నృసింహమూర్తి పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలతో నిండి, వికసించిన పద్మాల్లా ప్రకాశిస్తున్నాయి. స్వామి పాదాలు కదులుతూ ఉంటే, ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, కులపర్వతాలు, కూర్మరాజు తల్లడిల్లిపోయారు. ఉగ్రరూపంలో ఉన్న స్వామి తొడలు క్షీరసాగరంలో పుట్టిన ఐరావతం తొండాల్లాగా ఉన్నాయి. పీతాంబరధారి అయిన స్వామి నడుమున అలంకరించిన మువ్వల ఒడ్డాణం గణగణమని మోగుతున్నది. నరసింహుడి నాభి ఆకాశగంగలో సుడులు తిరిగే సరస్సులా ఉంది. వక్షస్థలం పెద్ద కొండచరియలా కఠినంగా, విశాలంగా ఉంది. గోళ్లు కొడవళ్లలా, పదునుదేలిన నాగళ్లలా ఉన్నాయి. శత్రువుల కండ్లకు మిరుమిట్లు గొలిపే నెగళ్లలాగా ఉన్నాయి. కానీ, భక్తుల నేత్రాలకు అవి.. చకోరాలకు చంద్రరేఖల్లాగా కనిపిస్తున్నాయి. నిజానికి స్వామి చేతిగోళ్లు వజ్రాయుధాలు!
స్వామి బాహువులు శంఖ, చక్ర, గద, ఖడ్గ, కుంత, తోమరాది ఆయుధాలతో నిండి ఉన్నాయి. కాంతులీనే కాలి కడియాలు, మణిఖచితమైన హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు, కిరీటం వంటి దివ్య ఆభరణాలతో ధగధగ మెరిసిపోతున్నాడు. స్వామి కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలా ఉంది. కానీ, హిరణ్యకశిపునిపై క్రోధంతో చలిస్తున్నది. శరత్కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లా స్వామి కోరలు తళతళమంటున్నాయి. స్వామి నాలుక ప్రళయకాలంలో అన్ని లోకాలను కబళించడానికి చాచిన అగ్నిజ్వాలలా ఉంది. నోటితోపాటు నాసికా రంధ్రాలు కొండగుహల్లాగా ఉన్నాయి. ఊర్పులు వేడిగా ఉండటం వల్ల సప్తసాగరాల్లోని జలం సలసల కాగుతున్నది. కొలిమిలోంచి అప్పుడే తీసిన బంగారు ముద్దల్లాగా కండ్లు భయంకరంగా ఉన్నాయి. స్వామి కనుకొలకుల్లోంచి విరజిమ్మే విస్ఫులింగాల వల్ల గ్రహతారకలు, నక్షత్ర మండలాలు కకావికలమైపోయాయి. ఇంద్రధనుస్సులాగా వంగిన కనుబొమలు చూడటానికి భయంకరంగా ఉన్నాయి. చెక్కిళ్లు గండశిలల్లా నునుపుగా ఉన్నాయి. జడలు సంధ్యాకాలంలో ఎర్రబడిన మేఘమాలికల్లాగా ఉన్నాయి. జడలు కదలడం వల్ల పుట్టిన గాలి వేగానికి ఆకాశంలో సంచరించే విమానాలు తోవ తప్పుతున్నాయి. జూలు పొడవుగాను, దంష్ట్రలు భయంకరంగా, జిహ్వ మెరుస్తున్న కరవాలంలా ఉన్నాయి. చెవులు చలనం లేని శంఖాల్లా ఉన్నాయి. స్వామి శరీరం మీది రోమాలు పౌర్ణమినాటి చంద్రుడి కిరణాల్లా మెరుస్తున్నాయి. స్వామి శరీరం ఆకాశాన్ని స్పృశిస్తూ ఉంది. సైనికుల బారుల వలె కనిపించే భుజాలు దిశలలో వ్యాపించి, శంఖచక్ర గదాది ఆయుధాలతో రాక్షస సంహారానికి సిద్ధమైనట్లు భాసిస్తున్నాయి.
నరసింహస్వామి సింహగర్జనకు దిక్కులు అదిరిపోయాయి. దిగ్గజాలు బెదిరిపోయాయి. స్వామి దేహం వెండికొండలా మెరిసిపోతున్నది. రాక్షసులకు స్వామి ఆకారం భయంకరంగాను, భక్తుడైన ప్రహ్లాదునికి శుభకరంగాను కనిపిస్తున్నది. ముఖ్యంగా హిరణ్యకశిపునికి సంతాప కారణమైంది. ఇంత భయంకర ఆకారాన్ని దాల్చిన నరసింహస్వామి అంతరంగం మాత్రం కరుణరస భరితమైంది. స్తంభం నుంచి ప్రభవించిన స్వామి కంటపడటంతో హిరణ్యకశిపుడు చేష్టలుడిగి, కళ్లప్పగించి చూస్తూ మానులా ఉండిపోయాడు.
కం॥ నరమూర్తి గాదు, కేవల
హరిమూర్తియుఁ గాఁదు మానవాకారముఁ గే
సరియాకారము నున్నది
హరిమాయారచితమగు యథార్థము చూడన్
ఆ స్తంభంలో ఆవిర్భవించిన మూర్తిది ‘నర రూపం కాదు, సింహ రూపమూ కాదు. యథార్థంగా ఇది మానవాకారం, సింహాకారం రెండూ కలిసి ఏర్పడిన శ్రీహరి మాయారూపం. లేకపోతే, ఇటువంటి రూపం ఎక్కడైనా ఉంటుందా?’ అనుకున్నాడు హిరణ్యకశిపుడు. ఆ ఉగ్రరూపం చూడగానే ‘నాకు చావు తప్పదు. పోరాడి చావడమే ఉత్తమం’ అని భావించాడు. కానీ, స్వామి ఎదుట దావానలం ముందు మిణుగురుపువ్వులా మారిపోయాడు హిరణ్యకశిపుడు. విష్ణువు ముందు ఒక దైత్యుని ప్రతాపం ఎంత?
తే॥ సటలు జళిపించి గర్జించి సంభ్రమించి
దృష్టిసారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి
పట్టె నరసింహుఁడా దితిపట్టి నధిప!
‘నరకేసరి అదను చూచి జటలు ఝళిపించాడు. ఒక్కసారి గర్జించి హూంకరించాడు. కనుబొమలు ముడిచి తీక్షణంగా వీక్షించాడు. నాలుక వికృతంగా ఆడించి, విజృంభించి దానవేంద్రుణ్ని ఒడిసిపట్టుకున్నాడు.’
మ॥ విహగేంద్రుండహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సా
గ్రహుఁడై యూరువులందుఁ జేర్చి నఖసంఘాతంబులన్ వ్రచ్చె దు
స్సహు దంభోళికఠోరదేహు నచలోత్సాహున్ మహాబాహు నిం
ద్ర హుతాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్
‘నరసింహస్వామి ఒక్కసారి గర్జించి, గరుత్మంతుడు నాగుపామును చీల్చిన విధంగా తన తొడలపై అడ్డంగా పడుకునేలా చేసి, వాడిగా ఉన్న గోళ్లతో హిరణ్యకశిపుని రొమ్ము చీల్చాడు.’ దుష్టాత్ముడిని సంహరించి, భక్తాగ్రేసరుడిని (ప్రహ్లాదుడిని) రక్షించిన నరసింహుడిని సమస్త దేవతలూ, వేనోళ్ల స్తుతించారు. ప్రహ్లాదుడి భక్తిని కొనియాడారు.
మ॥ ఖరదంష్ట్రా భ్రుకుటీ సటానఖయు నుగ్రధ్వానయున్ రక్త కే
సరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ
నృసింహాకృతిఁ జూచి నే వెరవఁ, బూర్ణ క్రూర దుర్వార దు
ర్భర సంసారదవాగ్నికిన్ వెరతు, నీ పాదాశ్రయుం జేయవే!
ఉగ్ర నరసింహస్వామిని తన వచనాలతో శాంతింపజేసిన ప్రహ్లాదుడు.. ‘స్వామీ! భయంకరమైన కోరలు, కనుబొమలు, జడలు, గోళ్లు, నీ భీకర ధ్వనులు, రక్తరంజిత కేసరాలు, అగ్నినేత్రాలు, నీ మెడలోని పేగుల దండలూ వీటన్నిటితో ఉన్న నీ ఉగ్ర రూపం చూసి నేను ఎంతమాత్రం భయపడను. కానీ, భయంకరమైనదీ, భరింపరానిదీ, క్రూరమైనదీ, నికృష్టమైనదీ అయిన ఈ సంసార దావాగ్నిని చూసి వణుకుతున్నాను. కరుణించి నీ చరణ సన్నిధిలో నాకు శరణు ప్రసాదించమ’ని వేడుకోగా, నరసింహుడు ప్రసన్నుడయ్యాడు. వాత్సల్యంతో బాలభక్తుడి తలపై ఆశీః పూర్వకంగా చేయి ఉంచి అభయమిచ్చాడు.
– ఆర్షకవి ఆచార్య మసన చెన్నప్ప, 98856 54381