తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు 15 గంటల సమయం పడుతున్నది. కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. క్యూ లైన్లో నిల్చొని ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, పులిహోర అందిస్తున్నారు. భక్తులు సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. కాగా, సెప్టెంబర్ నెలకు గాను ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేసింది.
తిరుమలలో రద్దీ కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. దాంతో తిరుమల కొండపై కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి ఎస్ఎంసీ జెనరేటర్ వరకూ క్యూ కొనసాగుతున్నది. ఒక్కసారిగా భక్తులు చేరుకోవడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటి నుంచే భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. క్యూ లైన్లలో ఉన్న వారికి అన్నప్రసాదాలు, మంచినీరును టీటీడీ అధికారులు అందజేస్తున్నారు.
ఇలాఉండగా, భక్తుల రద్దీ పెరగడంతో స్వామి వారి హుండీ కలెక్షన్ కూడా పెరిగిపోయింది. బుధవారం ఒక్కరోజే 76,418 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 38,629 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.73 కోట్లని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నందున సంయమనం పాటించాలని వారు కోరుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ నెలకుగాను ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను అధికారులు ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదలయ్యాయి. సెప్టెంబర్ నెలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోవాలనుకునే వారు ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.