Guru Purnima 2022 | గురువు అంటే..? ధనాన్ని అనుగ్రహించే నిధి కాదు. దోషాలను తొలగించే పరిహారం అంతకన్నా కాదు. ఆశలను నెరవేర్చడం గురువు పనికాదు. ఆశయాలకు అనుగుణంగా విద్యార్థిని తీర్చిదిద్దే బోధన గురువు. శిష్యుడి మనసులో ఎగసిపడే ఆలోచనలకు అడ్డుకట్టవేసే శోధన గురువు. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే సాధన గురువు.
శ్రీరాముడు లోకాభిరాముడైనా వశిష్ఠ, విశ్వామిత్రుల ఎదుట బాలరాముడే! శ్రీకృష్ణుడు జగద్గురువైనా తన గురువైన సాందీపుని ముందు బాలకృష్ణుడే. వివేకానందుడు జగద్విఖ్యాతి చెందినా రామకృష్ణ పరమహంస చెంతన చిన్నవాడే. ఆర్ష ధర్మం గురువుకు కట్టబెట్టిన స్థానం అలాంటిది. అనేక గ్రంథాలు గురువును ఎంతో గొప్పగా వర్ణించి చెప్పాయి.
‘గురవే నిర్మలాశ్శాంతాః సాధనో మితభాషిణః
కామక్రోధ వినిర్ముక్తాః సదాచార జితేంద్రియాః॥
గురువు లక్షణాలను పైశ్లోకం వివరిస్తుంది. నిర్మలుడై, శాంతస్వభావం కలిగి, సాధన చతుష్టయ సంపత్తి కలిగి, మితభాషిగా ఉండాలి. కామక్రోధాలను వదిలిన వారై ఉండాలి. సదాచార ప్రవర్తకులై, జితేంద్రియులై ఉండాలి. అంతేకాదు, శాస్త్రం ఎంత తెలుసో, సంప్రదాయమూ అంతే తెలిసిన వారే ఉత్తమ గురువులు అని చెబుతారు పెద్దలు. ఎందరో విద్యార్థులకు మార్గదర్శిగా ఉండే గురువు అంతరంగంలో, బాహ్యంలో శుచిత్వం కలిగి ఉండాలి. అలాంటి ఉపాధ్యాయుడే ఆదర్శవంతుడు అవుతాడు. శిష్యులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దగలుగుతాడు. శిష్యులను ప్రోత్సహించడం మాత్రమే కాదు, వారి లోపాలను గుర్తించి వాటిని అధిగమించే అవకాశాలూ కల్పిస్తాడు. శిక్షణ ఇవ్వడం మాత్రమే అవసరమైతే తానే స్వయంగా పూనుకొని శిష్యుడిని ఉద్ధరిస్తాడు. ఇలాంటి సందర్భాలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి.
శ్రీరాముడు ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనిపించుకున్నాడంటే.. దాని వెనుక గురువుల అనుగ్రహమూ కనిపిస్తుంది. బాల్యంలో బ్రహ్మర్షి వశిష్ఠుడు నేర్పిన విద్య రామచంద్రుడిని యోగ్యుడిగా తీర్చిదిద్దింది. రాముడికి అస్త్రవిద్యతోపాటు సమత్వదృష్టినీ అనుగ్రహించాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుని కోరిక మేరకు రాముడికి తత్వోపదేశం చేస్తాడు. అదే వశిష్ఠ గీత. ఆరు అధ్యాయాలతో రామచంద్రుడి వ్యక్తిత్వాన్ని విశిష్టంగా మార్చిన రాత అది. యాగ సంరక్షణ కోసం విశ్వామిత్రుడి వెంట నడిచిన రామలక్ష్మణులు అపార బలసంపన్నులుగా తిరిగి వస్తారు. అస్త్రశస్ర్తాలెన్నో ఉపదేశం పొంది సాటిలేని మేటి యోధులుగా తయారవుతారు. ఇంతటి పరాక్రమం కలిగిన రాముడు సైతం రావణుడితో యుద్ధ సమయంలో నీరసిస్తాడు. అది గ్రహించిన అగస్త్య మహర్షి ఆగమేఘాల మీద రాముడి దగ్గరికి వచ్చి ఆదిత్య హృదయ స్తోత్రం ఉపదేశిస్తాడు. శిష్యుడిని ఉద్ధరించడం కన్నా గురువుకు వేరే ఆనందం ఏముంటుంది. వనవాస సమయంలో భవిష్యత్ దిశానిర్దేశం చేసిన అగస్త్యుడు.. ఆఖరి అంకంలోనూ అండగా నిలబడతాడు. శిష్యుడు ఏ సమస్యలో ఉన్నా.. తక్షణం స్పందించే వాడే గురువు అని ఈ ఉదంతం తెలియజేస్తుంది.
శ్రీకృష్ణుడు సాందీప మహర్షి దగ్గర చదువుకున్నాడు. కేవలం 64 రోజుల్లో 64 కళలను నేర్చుకున్నాడని చెబుతారు. గోకులంలో ఎంతటి అల్లరి పిల్లవాడైనా.. గురుకులంలో మాత్రం బుద్ధిగా చదువుకునే వాడట కన్నయ్య. తనకు విద్యాబుద్ధులు నేర్పిన సాందీప మహర్షికి అరుదైన గురుదక్షిణ సమర్పించాడు కూడా! చనిపోయిన మహర్షి కొడుకును యముడిని ఎదిరించి తిరిగి బతికించి గురుదంపతులకు ఆనందాన్ని కలిగించాడు శ్రీకృష్ణుడు. ఈ బాలకృష్ణుడే కురుక్షేత్ర సంగ్రామ సమయంలో గీతోపదేశం చేసి జగద్గురువు అయ్యాడు. యుద్ధ సమయంలో కుంగిపోయిన అర్జునుడిని శిష్యుడిగా భావించి కర్తవ్యబోధ చేశాడు. సకల వేదాల సారాన్నీ, శాస్త్రాల మర్మాన్నీ తెలియజేసి అర్జునుడిని ఉద్ధరించాడు భగవానుడు. భగవద్గీత కేవలం అర్జునుడి కోసం ఉపదేశించింది మాత్రమే కాదు, అతని ద్వారా కార్యనిర్వహణలో ఎలాంటి దక్షత చూపాలో సమస్త లోకానికీ అందించి జగద్గురువయ్యాడు.
ఏ స్వార్థమూ లేకుండా తన దగ్గర ఉన్న విజ్ఞానమంతా శిష్యుడికి ధారపోస్తాడు గురువు. ఆ జ్ఞానంతో తన శిష్యుడు లోకానికి ఉపకారం చేయాలని భావిస్తాడు. కానీ, అదే శిష్యుడు లోకకంటకుడిగా మారుతాడు అనుకుంటే, చూస్తూ ఊరుకోడు. ఇలాంటి సన్నివేశాలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. పరశురాముడు అవతారపురుషుడు. సకల శాస్త్ర కోవిదుడు. ఆయన దగ్గర శిష్యుడిగా చేరుతాడు కర్ణుడు. సకల అస్త్రాల ప్రయోగమూ తెలుసుకుంటాడు. బ్రహ్మాస్త్రాన్నీ గురు వరంగా పొందుతాడు. కానీ, వచ్చింది క్షత్రియుడని భావించిన పరశురాముడు భవిష్యత్ దర్శించి ఆగ్రహిస్తాడు. అత్యవసర సమయాల్లో అస్త్ర మంత్రాలు గుర్తుకురావని శపిస్తాడు. అధర్మ పక్షం వహించిన కర్ణుడిని అదుపు చేయకపోయి ఉంటే, మహాభారతం మరోలా ఉండేదేమో!
గురువుకు సరైన దక్షిణ ఇవ్వడం శిష్యుడి ధర్మం. గురుపత్ని కోరిందని ద్రుపద మహారాజును బంధించి తెచ్చి ద్రోణుడి పంతం నెగ్గించాడు అర్జునుడు. గురువు కోరడంతో తన బొటనవేలు కోసి ఇచ్చాడు ఏకలవ్యుడు. దేవగురువైన బృహస్పతి తన శిష్యుడైన శనైశ్చరుణ్ని అరుదైన గురుదక్షిణ కోరాడు. సూర్యపుత్రుడైన శని మారువేషంలో బృహస్పతి దగ్గర సకల శాస్ర్తాలూ నేర్చుకుంటాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆ శిష్యుడు మారు రూపంలో వచ్చినది శనైశ్చరుడని గురువుకు తెలుస్తుంది. శిష్యుడిపై వాత్సల్యం కొద్దీ శపించకుండా విడిచిపెడతాడు. గురుదక్షిణ సమర్పించుకునే అవకాశం ఇవ్వమంటాడు శని. అప్పుడు ‘నీ దృష్టి నాపై పడకుండా ఉంటే అది పదివేలు’ అని కోరుతాడు బృహస్పతి. సరేనంటాడు శనైశ్చరుడు. ఆ క్రమంలో జ్యోతిషశాస్త్ర రీత్యా గురు, శని పరస్పర దృష్టి, కలయిక జాతకుడికి మేలుచేస్తుంది. పైగా గురువుతో కలిసిన శని దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగిస్తాడని శాస్త్రం చెబుతున్నది.
లోకహితం కోసం అవతరించినవాడు వ్యాసుడు. వశిష్ఠ మహర్షి కొడుకు పరాశరుడు. అతను దాశరాజు కుమార్తె సత్యవతిని వివాహం చేసుకుంటాడు. పరాశర, సత్యవతి దంపతులకు జన్మించినవాడే వ్యాసుడు. శరీర ఛాయ నీలవర్ణంలో ఉండటంతో ‘కృష్ణ’ అనీ, యమునా నది రెండుపాయల మధ్యనున్న ప్రదేశంలో జన్మించడం వల్ల ‘ద్వైపాయనుడు’ అనీ, వేదాలను వర్గీకరించడం వల్ల ‘వేదవ్యాసుడు’ అనీ, ఆయన రమ్య కుటీరం బదరిలో ఉండటం వల్ల ‘బాదరాయణుడు’ అనీ ప్రసిద్ధి చెందాడు. అష్టాదశ పురాణాలు, మహాభారతంతోపాటు భాగవతాన్ని జాతికి అందించి భారతావనిని ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిపిన మహనీయుడు వేదవ్యాసుడు. ఆయన జన్మించిన ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయమైంది. విద్యాబుద్ధులు నేర్పే గురువులను వ్యాసుడిగా భావించి ఆనాడు పూజించడం ఆనవాయితీగా వస్తున్నది.
…✍ కణ్వస
Read More :
కొత్తగా పెళ్లయిన జంటను ఆషాఢంలో ఎందుకు ఒక్కచోట ఉండనీయరు?