kolanupaka | స్వయంభూ సోమేశ్వరుడు కొలువైన క్షేత్రం. వీరశైవ పంచాచార్యులలో ఒకరైన రేవణ సిద్ధేశ్వరుని జన్మభూమి. శ్వేతాంబర జైనుల ఆధ్యాత్మిక కేంద్రం. దైవారాధనకు అందరూ అర్హులేనని చాటిన సమతా సందేశం. వీరశైవాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన దక్షిణ కాశి. అష్టాదశ కులాల వీరశైవ మఠాల ఆధ్యాత్మిక నగరి. రాష్ట్రకూట, చాళుక్య, కందూరు చోళ, కాకతీయుల పాలనా కేంద్రం. గత వైభవ ఘనకీర్తి పతాక.. కొలనుపాక.
కొలనుపాక.. శతాబ్దాల క్రితం ఓ సుందర నగరం. ఇప్పుడు అచ్చమైన పల్లెటూరు. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. వెయ్యేండ్లకు పూర్వమే ఓ వెలుగు వెలిగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగస్థలి. జైన వైభవానికి, వీరశైవ విజృంభణకు నిలువెత్తు సాక్ష్యం. కానీ శైవ, బౌద్ధ, జైన, వైష్ణవాల ఘర్షణలో తన అస్తిత్వాన్నికోల్పోయింది. నాటి కులమఠాల ఆనవాళ్లు కొలనుపాక సామాజిక జీవితాన్ని మనకు కథలుగా చెబుతాయి.
రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, కందూరు చోళుల ఉప రాజధానిగా తెలుగు నేలపై అర్ధభాగాన్ని శాసించినా, కొలనుపాక ఏనాడూ చరిత్ర కెక్కలేదు! విధ్వంసకారులు చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసినట్లే, చరిత్రకారుల నిర్లక్ష్యం సాంస్కృతిక వికాసానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది. వీరశైవ మత వ్యాప్తి కోసం శివుని పంచముఖాల నుంచి రేవణసిద్ధ (బాళెహొణ్నూరు పీఠం), మరులసిద్ధ (ఉజ్జయిని పీఠం), ఏకోరామ (కేదారనాథ్ పీఠం), మల్లికార్జున పండితారాధ్య (శ్రీశైల పీఠం), విశ్వారాధ్య (కాశీ పీఠం) ఉద్భవించినట్టు శైవాగమాలు పేర్కొంటున్నాయి. స్వయంభువులుగా భావించే ఈ శివాచార్యులను ‘వీరశైవ పంచాచార్యులు’గా కీర్తిస్తారు. పంచాచార్యులలో ప్రథముడైన రేవణసిద్ధ (రేణుకాచార్యులు) కొలనుపాకలో స్వయంభూ సోమేశ్వర లింగం నుంచి ఉద్భవించినట్టు స్వయంభువాగమం చెబుతున్నది. శైవాగమాలలోని వీరాగమ, సుప్రభేదాగమాలు రేణుకాచార్యులను ప్రస్తావించాయి.
శ్రీమద్రేవణ సిద్ధస్య కొలిపాక పురోత్తమే!
సోమేశ్వర లింగ జనన మావాసః కదళీపురే!!
శివయోగి శివాచార్య 28 వీరాగమాది గ్రంథాలలోని వీరశైవ తత్వాన్ని సంగ్రహించి, రేణుకాచార్య ఉపదేశించిన శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తూ ‘సిద్ధాంత శిఖామణి’ అనే సంస్కృత గ్రంథాన్ని రాశారు. శక్తి విశిష్టాద్వైతం రేణుకాచార్యులు ప్రబోధించిన ఆధ్యాత్మిక సిద్ధాంతం. కాబట్టే దీనికి ‘రేణుకా గీత’ అని పేరు. శివాజ్ఞతో రేణుకాచార్య ‘శక్తి విశిష్టాద్వైతాన్ని’ స్థాపించాడు. ఈ సిద్ధాంతాన్నే ‘వీరశైవం’ అంటారు. ఆ కాలంలో.. ఆరాధ్య శైవంలో దేవాలయంలోకి నిమ్న కులాలకు అనుమతి లేదు. ఈ అస్పృశ్యతే అసంఖ్యాక ప్రజలను శైవానికి దూరం చేసింది. అవైదిక మతాలకు ఆకర్షితులవుతున్న ప్రజలను నిలువరించేందుకు రేణుకాచార్యులు శైవాన్ని సంస్కరించారు. అన్ని కులాల వారికి శివదీక్ష ఇచ్చారు. వీరశైవులతో లింగాన్ని ధరింపజేశారు. ఇష్టలింగాన్ని ధరించిన వాళ్లను ‘జంగమ దేవర’ అంటారు. జంగమవారే కర్మ కాండలు, వివాహాది శుభకార్యాలు నిర్వహించేలా ప్రోత్సహించారు. దీంతో అష్టాదశ కులాల వారిని వీరశైవం బాగా ఆకట్టుకున్నది. జంగమ దేవరలు శుభాశుభాలు పలుకుతూ వీరశైవ మతవ్యాప్తికి పాటుపడ్డారు. అలా, వీరశైవం ప్రజాదరణ పొందింది. రేణుకాచార్యుల కృషితో తెలుగు, కన్నడ నేలపై వీరశైవం ఓ ఉద్యమంలా వ్యాపించింది. అదో ‘సాంఘిక విప్లవం’. రేవణసిద్ధ ప్రతి కులానికీ ఓ వీరశైవ మఠాన్ని ఏర్పాటుచేశాడు. ఈ మఠాల పుణ్యమాని అష్టాదశ కులాల ప్రజలంతా శివారాధకులు అయ్యారు. రేవణ సిద్ధేశ్వర స్వామి వీరశైవ మతవ్యాప్తి కోసం దేశమంతా తిరిగారు. కదళీపురం (బాలెహళ్లి)లో వీరసింహాసన(రంభాపురి) పీఠం స్థాపించారు. రేవణసిద్ధులు కుల్యపాకలోనే సోమేశ్వరలింగంలో ఐక్యమయ్యారని ఐతిహ్యం.
కొలనుపాకలో శైవం, జైనం బహుళ ఆదరణ పొందాయి. వేల సంవత్సరాలు ఈ రెండు మతాలూ సహజీవనం చేశాయి. కొలనుపాకలో క్రీ.శ. తొమ్మిదో శతాబ్దం నుంచి సోమనాథ ఆలయం అభివృద్ధి చెందింది. ఒకప్పుడు, ఇక్కడ జైనం ఎక్కువ. కొలనుపాకలో వెయ్యేండ్లకు పూర్వమే శ్వేతాంబర శాఖకు చెందిన ఆలయాన్ని నిర్మించారు. జైన ప్రాబల్యం ఉన్నా సోమేశ్వరుడు నిర్విఘ్నంగా పూజలందుకున్నాడు. చాళుక్యుల తర్వాత కాకతీయులు అధికారంలోకి వచ్చారు. కాకతీయులు తొలినాళ్లలో జైనాన్ని ఆదరించారు. చివరి కాకతీయులు మాత్రం శైవాన్ని ప్రోత్సహించారు. కొలనుపాకలో అప్పటికే వైష్ణవం కూడా ఉంది. పారమార జగద్దేవుడు నిర్మించిన వీరనారాయణ ఆలయం సుప్రసిద్ధం. తర్వాత వచ్చిన పాలకులు ఈ ఆలయాన్ని పట్టించుకోలేదు. కన్నడ దేశపు కాలచూరిని ఏలుతున్న బిజ్జలుని మంత్రి బసవన్న వీరశైవ వ్యాప్తికి కృషిచేశాడు. రేణుకాచార్యులు కొలనుపాకలో వీరశైవాన్ని అభివృద్ధి చేశాడు. వీరశైవం తెలుగు నేలపై రాజాదరణ పొందింది. కాకతీయల ప్రోద్బలంతో ఉచ్ఛస్థితికి చేరింది. శైవాలయాలు, శైవపీఠాలు, శైవమఠాల నిర్మాణాలకు కాకతీయులు సహకరించారు. కొలనుపాకలోని కోటిలింగాల గుడి, ప్రతాపరుద్ర ఆలయం కాకతీయులు కట్టినవే. సోమనాథుడికి రాణి రుద్రమ పూజలు చేసినట్లు, తన భర్త చాళుక్య వీరభద్రుడికి కొలనుపాక ప్రాంతాన్ని అరణంగా ఇచ్చినట్లు శాసనాల్లో పేర్కొన్నారు.
కాకతీయ గణపతి దేవుడి కాలానికి తెలుగు నేలపై శైవం ఆధిపత్యంలోకి వచ్చింది. రాణి రుద్రమదేవి పాలనాకాలానికి వీరశైవం విజృంభించింది. శివుడు తప్ప ఎవరూ ఉండకూడదనే వాదన మొదలైంది. 11వ శతాబ్దం చివరి సంవత్సరాల్లో శైవ, జైన మతాలు ఘర్షణ పడ్డాయి. కొలనుపాకలోని జైన ఆలయాలను, బసదులను వీరశైవులు ధ్వంసం చేశారు. జైన, వైష్ణవాలయాలను శివాలయాలుగా మార్చారు. కొన్ని ఆలయాల పేర్లు శాసనాలకే పరిమితం అయ్యాయి. వీరశైవం ప్రబలిన తర్వాత ఆరాధ్య శైవం, వైష్ణవం వెనుకబడిపోయాయి. కాకతీయుల నిరాదరణ, వీరశైవుల విజృంభణతో కొలనుపాకలో జైనం క్షీణ దశకు చేరుకున్నది. రేవణ సిద్ధేశ్వరుల ప్రభావంతో కొలనుపాకలో అన్ని కులాల వాళ్లూ వీరశైవంలో చేరారు. ప్రతి కులం ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుంది. అష్టాదశ కులాల వారికి కొలనుపాకలో మఠాలున్నాయి. ప్రస్తుతం ఆ కులమఠాల సంఖ్య పద్దెనిమిది కంటే ఎక్కువే. తర్వాతి కాలంలో ఏర్పడిన కులాలు కూడా వీరశైవాన్నే అనుసరిస్తూ కొత్తగా మఠాలను ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు.
కొలనుపాకలోని మఠాల నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది. వీటన్నిటిలో శివలింగం, నంది విగ్రహం మాత్రమే ఉంటాయి. మరో విగ్రహానికి కానీ, ఇంకో దేవుడికి కానీ ఇక్కడ స్థానం లేదు. ఈ మఠాల నిర్వహణ, పూజా విధానాల్లో ఎంతో సారూప్యం కనిపిస్తుంది. ప్రతి కులమఠానికి ఒక గురువు, కులపెద్ద బాధ్యులుగా ఉంటాడు. మఠ గురువు, మఠ పెద్ద, సభ్యులైన వీరశైవులు ఇష్టలింగాన్ని ధరిస్తారు. నిత్యం మఠంలోని శివలింగాన్ని కడిగి, పత్రి, పుష్పాలతో పూజ చేసి, నైవేద్యం పెడతారు. ఆ తర్వాతే భోంచేస్తారు. మఠాలన్నిటికీ జంగమ దేవరలే గురువులు. ‘గురువు’ అంటే విద్యా బోధన చేసేవాడని అర్థం. మత బోధన మఠం ప్రధాన బాధ్యత. వీరశైవం వైపుగా ఆకర్షితులైన నిమ్న కులాల వారికి వీరశైవ తత్వాన్ని, మోక్ష మార్గాన్ని బోధించేందుకు ఆ కులానికే చెందినవారికి ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు. కొలనుపాకలోని కులమఠాలన్నీ రంభాపురి పీఠాన్ని అనుసరిస్తాయి. కులమఠాలకు ఉన్నట్లుగా పెద్ద మఠానికి ప్రత్యేకమైన కట్టడం ఏమీ లేదు. పెద్ద మఠం గురువుని కులమఠాలన్నీ అనుసరిస్తాయి. ప్రస్తుతం పెద్ద మఠం గురువుగా జంగమదేవర శంకరయ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కొలనుపాకలోని అన్ని కులాలకూ ప్రత్యేకమైన పురాణాలు ఉన్నాయి. మఠ గురువుల దగ్గర ఆ ప్రాచీన ప్రతులు ఉంటాయి. వీటిని పండుగ రోజుల్లో మాత్రమే పఠిస్తారు. తమ కులం ఎలా పుట్టింది? ఎలా అభివృద్ధి చెందింది?.. తమదైన కుల పురాణాల్లో ప్రస్తావించారు. ఎవరికి వారు తమ కులం గొప్పదనే భావనతో ఈ గ్రంథాన్ని రాసుకున్నారు. మిగతా కులాలకు తమ కులమే మూలమనే ప్రతిపాదనా ఉంది. ఇలా ఎవరి కుల సాహిత్యం వారిదే. కాలక్రమంలో కొన్ని కుల చరిత్రలు అంతరించిపోయాయి.
అందరికీ శివుడే ఆరాధ్య దైవం. ఆ దేవుడిని కూడా తమ కులంవాడిని చేసుకోవడం మఠాల ప్రత్యేకత. కులమఠాల వాళ్లు ఎవరికి వారు.. తమ కులానికి అనుగుణంగా శివుడికి నామకరణం చేశారు. సురాభాండాన్ని తీసే గౌడవారు శివుడిని ‘సురాభాండేశ్వరుడు’ అని పిలుచుకుంటున్నారు. కోమట్లు ‘నగరేశ్వర స్వామి’ అని కొలుస్తున్నారు. మేదర మఠంలోని శివుడిని ‘కేతేశ్వర స్వామి’గా వ్యవహరిస్తారు, అదే ఆదిదేవుడు మేరు మఠంలో ‘శంకర దాసమయ్య’ అయ్యాడు.
కొలనుపాక ఒకప్పుడు ఏడు వేల గ్రామాలకు రాజధాని. ఆ గ్రామ ప్రజలకువీరశైవ తత్వాన్ని బోధించి, మోక్షమార్గాన్ని అనుసరించేలా చేయడం కుల గురువుల బాధ్యత. ఆచార్యుల బతుకుదెరువు, కులమఠంలోని సన్యాసుల పోషణ, శివ పూజల నిర్వహణ కోసం ఏడువేల గ్రామాలవారు ధనం, ధాన్యం ఇచ్చేవారు. కాబట్టే, కులమఠాల్లో ధూపదీప నైవేద్యాలకు లోటు రాలేదు. శివరాధన, వీరశైవ బోధన నిరాటంకంగా కొనసాగింది. కాకతీయుల పతనం తర్వాత ముస్లింలు అధికారంలోకి వచ్చారు. దీంతో వీరశైవులకు కష్టాలొచ్చాయి. కొలనుపాక కులమఠాలకు ఇచ్చే దానాలపై సుల్తానులు పన్ను విధించినట్టు తమ తాతలు చెప్పేవారని మాదిగ మఠం గురువు వెంకటేశ్ బాల్య జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పన్నుల దెబ్బకు దానాలు తగ్గిపోయాయి. ధూప, దీప, నైవేద్యాలు నిలిచిపోయాయి. విద్యాబోధన కుంటుపడింది. దీంతో కొలనుపాక గురువులు, మఠాధిపతులు నేరుగా గోల్కొండ నవాబు వద్ద గోడు వెళ్లబోసుకున్నారట. ఆ విన్నపానికి ఏలినవారు సానుకూలంగా స్పందించారు. గ్రామగ్రామాన వీరశైవం ప్రచారం చేసుకోవడానికి.. దాన, ధర్మాలు స్వీకరించడానికి అనుమతిస్తూ ఫర్మానా జారీ చేశారు.
ఒకప్పుడు (రుద్రమదేవి కాలంలో) ప్రతి మఠానికి ముప్పావు ఎకరం స్థలం, 10 నుంచి 15 ఎకరాల మాన్యం ఉండేది. నిజాం పాలన వరకు ఆ ఆస్తులు మఠాల అధీనంలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, కులపెద్దలు ఆ భూములకు పన్నులు కట్టలేక వదులుకున్నారు. మాన్యాలు లేక, దానాలూ అందక, నిత్య పూజలు జరుగక మఠాలు వెలవెలబోతున్నాయి. ‘ఏ మఠం గురువులూ సంచారం చేయలేదు. సన్యాసం పుచ్చుకునేవాళ్లే లేరు. విద్యాబోధనా లేదు. పూజారులుగా మిగిలిపోయాం’ అంటూ మఠాల గురువులు వాపోతున్నారు. కొలనుపాక చారిత్రక సంపదను కాపాడే క్రమంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది, శాసనాలు పరిష్కరించింది. ఇంకా పరిష్కరించాల్సిన శాసనాలు మిగిలే ఉన్నాయి. శ్రీవీరనారాయణ ఆలయం వద్ద తవ్వకాలను మధ్యలోనే ఆపేయడం వల్ల శాసనాలు మట్టిలోనే మిగిలిపోయాయి. సోమేశ్వరాలయాన్ని వారసత్వ కట్టడంగా పురావస్తు శాఖ ప్రకటించింది. ఈ ఆలయంతోపాటు గ్రామంలోని అన్ని కులమఠాలను రక్షిత కట్టడాలుగా ప్రకటించి పరిరక్షించాల్సిన అవసరం ఉంది.
కొలనుపాకలో కులం ప్రాతిపదికగా ఏర్పాటు చేసిన మఠాలు మొత్తం ఇరవై రెండు. మరే పట్టణంలోనూ ఇన్ని మఠాలు లేవు. శ్రీశైలంలో పదమూడు మఠాలుండేవని శాసన, సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. కొలనుపాకలో ఇప్పటికీ 22 మఠాలు నిలిచి ఉన్నాయి. వీరశైవ వ్యాప్తి కోసం కులమఠాలను ఏర్పరిచారు. కులమఠాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలుగానే కాక సామాజిక సమస్యలను పరిష్కరించే వేదికలు కూడా. ప్రతి కులం వాళ్లు తమ మఠం దగ్గర సమావేశమై, తమతమ సమస్యలు చర్చించుకునేవారు. వివాదాలు పరిష్కరించుకునేవారు. ఇదంతా మా చిన్నప్పటి ముచ్చట. తరాలు మారాక కులమఠాల్లో వివాదాల పరిష్కారం ఆగిపోయింది. అప్పట్లో మఠాలు బ్యాంకులుగానూ పనిచేశాయి.
– విరువంటి గోపాలకృష్ణ, చరిత్ర పరిశోధకుడు
వడ్డెర మఠం
వడ్డెరలు సంచార జీవులు. వందల ఏండ్లపాటు పూజలు లేకపోవడంతో వడ్డెర మఠం చుట్టూ చెట్లు పెరిగిపోయాయి. అయిదేండ్ల క్రితం వడ్డెర మఠాన్ని పునరుద్ధరించారు.
కురుమ మఠం
కురుమ మఠం గురువు బతుకుదెరువు కోసం పట్నంలో ఉంటున్నాడు. ఆయన లేనప్పుడు తమ్ముడు, తల్లి పూజలు చేస్తారు. మఠాల్లో శివారాధన చేసేవారిలో ఆమె ఒక్కరే మహిళ.
మేదర మఠం
కొలనుపాకలో మేదర కులంలో సత్తెయ్య కుటుంబం ఒక్కటే ఉన్నది. మఠ పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పద్మశాలి మఠం
ఒకప్పుడిది శిథిలంగా ఉంది. పూజలూ లేవు. 1993లో ఆ ఊరి పద్మశాలి కుటుంబాలకు చెందిన యువకులంతా కలిసి పునరుద్ధరణకు నడుంకట్టారు.
చాకలి, మంగలి మఠాలు
చాకలి, మంగలి సామాజిక వర్గాలది ఒకటే (మడివేలు మాచయ్య పురాణం) పురాణం. మడివేలు మాచయ్య వీరశైవుల బట్టలు తప్ప ఇతరుల బట్టలు ఉతకనంటున్నాడని ఎవరో బిజ్జలునికి ఫిర్యాదు చేశారట. దీంతో బిజ్జలుడు అందరి బట్టలనూ మూటకట్టి ఏనుగుపై మడివేలు మాచయ్య ఇంటికి పంపాడట. మాచయ్య కోపంతో ఆ బట్టలు తెచ్చిన ఏనుగు నోరును చీల్చినాడట. చాకలి మఠంలో ఆ ఘట్టాన్ని శిల్పంగా చెక్కారు.
కొలనుపాకలో అనేక మఠాలు శిథిలమైపోయాయి. కొన్ని సగం కూలిపోయి ఉన్నాయి. తెనుగు మఠం ఏనాడో మట్టిపాలైంది. ఆనవాళ్లే లేవు. శిథిలావస్థకు చేరిన గాండ్ల మఠాన్ని ఈ మధ్యనే బాగు చేసుకున్నారు. చాలా మఠాలకు పూజారులు లేరు. ఉన్న మఠాల్లో నిత్య పూజలు చేయలేకపోతున్నారు. ‘ఇప్పుడిప్పుడే కొన్ని కులాల్లో మా మఠాలను బాగు చేసుకోవాలె’ అన్న భావన వస్తున్నదని గౌండ మఠం గురువు సోమయ్య అంటున్నాడు. ఇప్పుడు గొల్ల, గౌడ, మేదర, వైశ్య, గాండ్ల, కురుమ, పంచదాయి, మాదిగ మఠాల్లో కొన్నిటిలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. పంచదాయి, పద్మశాలి మరికొన్ని మఠాల్లో కొంత డబ్బును మఠనిధిగా ఏర్పాటుచేసి తమ సామాజిక వర్గానికే వడ్డీలకు ఇస్తున్నారు. మఠం ఆధ్వర్యంలో చిట్టీలు నిర్వహిస్తూ వచ్చిన కమిషన్ను మఠ నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు.
కొలనుపాకలో ఇప్పటికీ పరిష్కరించని శాసనాలు అనేకం. తెలంగాణ చరిత్రకు ఆధారమైన ఆ శాసనాలను వెలికితీసి, చరిత్రకు కొత్త అధ్యాయాలు జోడించాలి. కొలనుపాక స్వయంభూ సోమేశ్వరాలయంలో ఆయుర్వేద వైద్య చికిత్స కూడా చేసినట్లుగా ఆధారాలున్నాయి. నాడు పసరు తీయడానికి, చూర్ణం చేయడానికి నూర్పిడి చేసిన రాతి ఆనవాళ్లు ప్రధాన మండపంలో కనిపిస్తాయి. వాటిని పరిరక్షించాలి. కొలనుపాక చరిత్రను మరింత వెలుగులోకి తేవడంతోపాటు ఈ చారిత్రక సంపదను కాపాడాలి.
– రెడ్డి రత్నాకర్ రెడ్డి, పరిశోధకుడు
ఇప్పటికే, తెలంగాణ ప్రభుత్వం కొలనుపాక అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) ఆధ్వర్యంలో కొలనుపాకలోని స్వయంభూ
సోమేశ్వరాలయాన్ని పునరుద్ధరించే పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆలయం చుట్టూ తవ్వకాలు జరుపుతూ భూమి పొరల్లో కూరుకుపోయిన శిల్పాలు, శాసనాలు, శిలా ఖండితాలను వెలికి తీస్తున్నారు. ఆలయం చుట్టూ తవ్వకాలు పూర్తయిన తర్వాత కొత్త నిర్మాణాలు చేపడతారు. విశ్రాంత ప్రభుత్వాధికారి, వైటీడీఏ ఉపాధ్యక్షులు కిషన్ రావు ఆధ్వర్యంలో ఆలయ సంరక్షణ కోసం పురాతన ఆలయాల పరిరక్షణలో నిష్ణాతులను నియమించి పనులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణను తన భుజానికెత్తుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కొలనుపాక పునర్వైభవానికి కంకణం కట్టుకున్నారు.
కొలనుపాకలో అనేక కుల మఠాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు దొరికిన శాసనాల్లో ఎక్కడా ఏ ఒక్క కులమఠం ప్రస్తావనా లేదు. వీటి వాస్తు, నిర్మాణ శైలిని బట్టి మఠాలు కాకతీయుల కాలంలో ప్రారంభమైనట్టు స్థపతి, పురావస్తు శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఈమని శివనాగిరెడ్డి విశ్లేషించారు. మఠాలన్నిటికీ ఒకే నిర్మాణం లేదు. వీటిలో కాకతీయ, విజయనగర కాలపు నిర్మాణం కనిపిస్తున్నది. దీనినిబట్టి కులమఠాలు దాదాపు ఎనిమిది వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఉనికిలో ఉన్నట్టు స్పష్టం అవుతున్నది.
‘ఒకప్పుడు కొలనుపాకలో జైనం వర్ధిల్లింది. ఆ కాలంలో నిర్మించిన జైనాలయాలు, జైన బసదులను వీరశైవులు ధ్వంసం చేశారు. నాటి జైన బసదుల్లోని తీర్థంకరుల విగ్రహాలను తొలగించి శివలింగాన్ని ప్రతిష్ఠించారు’ అని స్థానికుల వాదన. ఆ వాదనను ఖండిస్తారు శివనాగిరెడ్డి. ఎందుకంటే?.. జైన బసదులను మార్చి ఉంటే, దానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండేవని, ఏ చిన్న ఆనవాలు కూడా మఠాల్లో కనిపించలేదని, స్వతంత్ర నిర్మాణాల్లా కనిపిస్తున్నాయని ఆయన అంటున్నారు.
మ్యూజియం
సోమేశ్వరాలయానికి ముందు ప్రదర్శన మండపంలో రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియం ఉంది. ఇందులో కొలనుపాక, పరిసర ప్రాంతాలలో లభించిన
శాసనాలు, శిల్పాలను భద్రపరిచారు. ఆలయానికి ప్రధాన ద్వారంగా ఉన్న కాకతీయ కీర్తి తోరణం, మత్స్యవల్లభుడు, మహావీరుడు, బుద్ధుడు.. మరెన్నో శిల్పాలు, శాసనాలున్నాయి. స్థానికంగా లభించిన బుద్ధుని విగ్రహం ఆధారంగా ఒకప్పుడు కొలనుపాకలో బౌద్ధం కూడా ఉండేదని నిర్ధారించారు.
మహిషాసురమర్దిని, సప్తమాతృకలు, చండి, చాముండి విగ్రహాలు తవ్వకాల్లో అనేకంగా బయటపడ్డాయి. కొలనుపాకలో శాక్తేయానికి ఉన్న ఆదరణకు ఈ విగ్రహాలే సాక్ష్యాలు!
దక్షిణ కాశి
కొలనుపాక దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందింది. కొలనుపాక సమీపంలో ‘కాశీ బుగ్గ’ అనే నడబావి ఉన్నది. దానికి పక్కనే చిన్న శివాలయం కూడా ఉంది. శివభక్తులు కాశీ బుగ్గలోని నీటిని అపర గంగగా భావిస్తారు. ఈ గుడిలోని శివుడిని అపర (కాశీ) విశ్వేశ్వరుడిగా కొలుస్తారు. కాశీ బుగ్గను దర్శించుకుంటే వారణాసిని దర్శించుకున్నట్లేనని శైవుల భావన. ఒకప్పుడు కులమఠాల్లో జరిగే శివపార్వతుల కల్యాణ వేడుకను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన శివభక్తులు తమతమ కులమఠాల్లో జాగారం చేసేవారు. తమ కుటుంబికులు చనిపోతే దశదిన కర్మ తర్వాత కొలనుపాకకు వచ్చి కులమఠంలో నిద్ర చేసేవారు. తెల్లారి కాశీ బుగ్గలో అస్థికలు కలిపిపోయేవారు.
ఒక్కో గంటలో కిలో బంగారం!
కొలనుపాకను ఆనుకుని ప్రవహిస్తున్న వాగులో 1969లో పంచలోహ గంటలు బయటపడ్డాయి. ఈ గంటలను చాళుక్యుల కాలంలో కండప్ప నాయకుడు దానం చేసినట్లుగా వాటిపై రాసి ఉంది. ఒక్కో గంటలో కిలో బంగారం ఉందట. ఖరీదైన ఈ గంటలను హైదరాబాద్లో రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో భద్రపరిచారు. కొలనుపాక గ్రామం.. హైదరాబాద్ – వరంగల్ ప్రధాన రహదారిపై హైదరాబాద్ నగరానికి 77 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలేరు పట్టణం వస్తుంది. అక్కడి నుంచి మరో ఆరు కిలోమీట్లర దూరం ప్రయాణించి కొలనుపాక చేరుకోవచ్చు.
ఎన్నో పేర్లు..
కొలనుపాకకు అనేక పేర్లు. కొలిపాక, కుల్పాక, కొట్టియపాక, కొల్లియపాక, కొట్టిపాక, కొల్లిహకెగా శాసనాల్లో పేర్కొన్నారు. సోమశేఖరపురము, సరోవర కుటీరము, బింబావతిపురి, వ్యాఘ్రనగరము, కుదుటపురి, కుళుదపురము అనే నామాలు కూడా ఉన్నట్టు స్థల పురాణం. 17వ శతాబ్దం వరకు శాసనాల్లో ‘కొల్లిపాక’గా పేర్కొన్నారు. తర్వాత కాలంలో కొలను
పాకగా మారింది. జన వ్యవహారంలో ‘కొలనుపాక’ మాత్రమే ఉంది.
… నాగవర్ధన్ రాయల, ఫొటోలు : గడసంతల శ్రీనివాస్
“ఆదివాసీలు ఇప్పపూలతో భూదేవిని పూజించే ఈ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా !!”
“తాళపత్రాలను ఎలా తయారుచేస్తారు? వాటిపై ఎలా రాస్తే ఎక్కువ కాలం ఉంటాయ్ !!”