Srisailam | శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలంలోని వెండికొండపై వెలసిన భ్రమరాంబ సమేత మల్లికార్జునులను రథంపై అధిష్టించి క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు. మంగళవారం సాయంత్రం ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో అర్చకవేదపండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవాయిద్యాలు, ఢమరుకనాదాలతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవానికి ముందుగా ఆలయ ప్రాంగణం నుంచి స్వామిఅమ్మవార ఉత్సవమూర్తులను పల్లకిలో తోడుకుని వచ్చారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం రథాంగపూజ, హోమం, రథాంగబలి కార్యక్రమంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి స్వామి అమ్మవార్లకు సాత్వికబలి సమర్పించారు. ఉగాది మహోత్సవంలో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని వీక్షించేందుకు రెండు రోజులుగా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులు లక్ష మందికి పైగా వేచి ఉన్నారు.
ఉగాది మహోత్సవాల్లో శ్రీభ్రమరాంబ అమ్మవారు శ్రీరమావాణి సేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో భక్తులను కటాక్షించింది. అలంకారం మండపంలో మహా సంకల్పాన్ని పఠించి షోడశోపచార పూజలు నిర్వహించారు. చతుర్బుజాలు కలిగిన అమ్మవారు పాశం అంకుశం పద్మం చెరుకుగడలతో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించేదుకు భక్తులు బారులుదీరారు.