వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజహి॥
లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వర్షం కురుస్తుందని శాస్త్ర వచనం. ఆ వర్షం కారణంగానే నేల మీద విత్తనాలు మొలకెత్తి సమస్త జీవులకు ఆహారం అందుతున్నది. అంతేకాదు, ఆ తల్లి మనలో జ్ఞాన బీజాన్ని మొలకెత్తించి విజ్ఞాన ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుంది. లక్ష్మీ కటాక్షం సంతోషాలకు మూల కారణం. అయితే, ఆ ఆనందాల్లోనే తేలిపోతూ మనలోని సద్గుణాలను విడిచిపెట్టిన క్షణం నుంచి పతనం మొదలవుతుంది.
సంతోషం కలిగినప్పుడు విచక్షణ కోల్పోకుండా, వివేచనతో మెలగాలి. జ్ఞాన తృష్ణను తీర్చుకుంటూ ధార్మికతవైపు పయనించాలి. కలిగిన దాంట్లో నలుగురికీ సాయం చేస్తూ పునీతులం కావాలి. అప్పుడే లక్ష్మీ అనుగ్రహానికి సార్థకత ఏర్పడుతుంది.