తిరుమల : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం రాత్రి హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.
వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు శేషగిరి, మధుసూదన్, ఏవీఎస్వో వెంకటరమణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు.