యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ॥ (గీత 18-78)
ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో… అక్కడ ‘శ్రీ’తో కూడిన విజయం స్థిరంగా ఉంటుంది. కృష్ణుడు విజ్ఞానానికి ప్రతీక, అర్జునుడు నైపుణ్యానికి సూచిక. ఈ రెండూ కలిస్తే విజయం. ప్రాకృతిక స్పందనల ద్వారా లభించేది జ్ఞానం. హేతు బద్ధమైన జ్ఞానం పరిణతినిస్తుంది. దాన్నే విజ్ఞానం అంటాం. ఈ విజ్ఞానం అక్షర బద్ధమైతే ‘సాక్షర’మవుతుంది. కాని ఆ ‘సాక్షర’త గతి తప్పి విపరీతం అయితే ‘రాక్షస’మవుతుంది. అయితే ఈ ‘సాక్షర’త్వం ‘రాక్షస’త్వం కాకుండా ఉండాలి అంటే… మనసు సమత్వాన్ని పొందాలి. సమత్వం యోగ సాధన వల్ల సమకూరుతుంది. యోగ సాధనతో శుద్ధి అయిన విజ్ఞానం ఆదర్శవంతమైన కర్తవ్యాన్ని బోధిస్తుంది. కర్తవ్యసాధనలో దోవను చూపుతుంది. అందుకే యోగం విజ్ఞానాన్ని, విజ్ఞానం యోగాన్ని ఆశ్రయించాలి, ఆరాధించాలి, అభిమానించాలి, ఆదరించాలి, అనునయించాలి.
యోగ సాధనలో ఉన్నతిని సాధించిన వారికి ప్రభువు శ్రీకృష్ణుడు. ‘కృషి’ భూ వాచక శబ్దం. అంటే ఫలితాన్ని అందించేది. ‘ణ’ నివృత్తి మార్గానికి ప్రతీక. నివృత్తి మార్గంలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో కృషి చేసి కృష్ణుడు యోగీశ్వరుడయ్యాడు. దానివల్ల ఆయన పొందినది.. శ్రీ. అంటే.. లక్ష్మి, సంపద, ఐశ్వర్యం, వృద్ధి, శోభ, అలంకారం, యశస్సు, కీర్తి, ప్రతిష్ఠ, బుద్ధి, సరస్వతి, విషం, ఉపకరణం, త్రి వర్గం అంటుంది శబ్ద రత్నాకరం. విజ్ఞానానికి ప్రతీక సరస్వతి.. బుద్ధి వికసన వల్ల అభివృద్ధి, తద్వారా శోభ, దానితో సంపద, దానితో ఐశ్వర్యం, తద్వారా అలంకారం, యశస్సు, కీర్తి ప్రతిష్ఠలు, చివరగా త్రివర్గ ప్రాప్తి కలుగుతుంది. సకారాత్మకమైన ఈ వైఖరి వల్ల లక్ష్మీయుతమైన విజ్ఞాన సరస్వతి సాక్షరమై దీపిస్తుంది. ఇది విపరీతమైనా, నకారాత్మకమైనా ‘రాక్షస’మవుతుంది. సకారాత్మకమైన కృష్ణుడి యోగ సాధన వల్ల అతనిలో వికసన, వికసన వల్ల విస్తరణ, విస్తరణ వల్ల అభివృద్ధి పాదుకున్నాయి. ఆ అభివృద్ధి శ్రీత్వానికి మార్గం చూపడం వల్ల అతణ్ని వరించింది ‘శ్రీ లక్ష్మి’.
ఇక అర్జునుడు నిత్య విద్యార్థిగా సాధనను ఆశ్రయించాడు. గురువు మార్గం చూపిస్తాడు, ప్రేరణ అందిస్తాడు. విద్యార్థి ఆ ప్రేరణతో స్ఫూర్తి పొంది నేర్చుకోవాలి. నేర్చుకునే ప్రక్రియ అనంతమైనది కాగా నేర్పే ప్రక్రియ పరిమితమైనది. పరిమితమైన తెలిసిన దానిని ఆలంబనగా చేసుకుని అనంతమైన తెలియని విషయాలను అవగాహన చేసుకొనే ప్రక్రియలో ఆనందించే వాడు అర్జునుడు. అందులో పరిణతిని సాధిస్తూ ఆనందాన్ని ఆత్మగతం చేసుకుంటున్న వాడు అర్జునుడు. తన ఏకైక లక్ష్యం జగజ్జేతగా నిలవడం. సరైన మార్గంలో, సరైన విధానంతో సాధించిన పరిణతి ప్రాతిపదికగా ఏర్పరచుకున్న పోటీ తత్వం ఇతరులతో కాకుండా తనతో తానే పోటీపడే మానసిక పరిపక్వతను ఇస్తుంది. పరులతో పోటీ ఎదుటివారిని అధిగమించగానే స్తబ్ధతనిస్తుంది. కాని మనతో మనం పోటీ పడటం వల్ల ఏ నిమిషానికి ఆ నిమిషమే మనల్ని మనం సమున్నతంగా తీర్చిదిద్దుకోగలుగుతాం. అదే అర్జునుడు చేసింది. నేటి కన్నా రేపు మరింత అభివృద్ధి సాధించాలనే తపన తనది. అనుక్షణం తనను తాను సంస్కరించుకునే విధానం నేర్పగా నిత్యవిద్యార్థిగా నైపుణ్యం సంతరించుకున్నాడు.
ధర్మ మార్గంలో అభివృద్ధి ప్రాతిపదికగా సాధిస్తున్న విజ్ఞానం, దాని మార్గంలో వెలుగుచూసిన నైపుణ్యం ఎక్కడైతే వికసిస్తాయో అక్కడ శాశ్వతమైన సంతృప్తితో కూడిన విజయం దక్కుతుంది. అలాంటి సంతృప్తి మరొక లక్ష్యానికి మార్గం చూపుతుంది. భారతంలో అర్జునుడి లక్ష్యం భౌతికమైనది కావడం వల్ల దివ్యత్వాన్ని సంతరించుకోలేక పోయింది. ద్రౌపది ప్రతీకారేచ్ఛ, తను జగజ్జేతను అనిపించుకోవాలనే పట్టుదల వల్ల పరమేశ్వర సాక్షాత్కారం లభించినా తన సాధన యావత్తూ దివ్యాస్ర్తాల సముపార్జనకే పరిమితమైంది. దారుణ మారణ హోమానికి ఉపకరణాలయ్యాయి. అర్జునునికి భిన్నంగా శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన స్థితప్రజ్ఞత సాధించిన వ్యక్తిగా భారతంలో ఎన్నో సందర్భాలలో దర్శనమిస్తాడు. ‘శ్రీ’తో కూడిన విజయం లక్ష్యంగా ధనుస్సు ఉపకరణంగా సమత్వం పొందిన మనసు సాధించిన విజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొన్న కృష్ణార్జునులు విజ్ఞానం, నైపుణ్యాలకే కాక సంయమనం, సౌహార్ద్రత, పరస్పర అవగాహన, అన్యోన్యత లాంటి ఎన్నో విషయాలను విశదపరుస్తారు. అందుకే, కృష్ణార్జునులు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. లక్ష్యసాధన ఆవిష్కృతమవుతుంది అని గీత బోధిస్తుంది.
…?పాలకుర్తి రామమూర్తి